న్యూఢిల్లీ, మార్చి 10: విస్తరిస్తున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో చిక్కుకుపోయిన కార్గో నౌకలు, చమురు ట్యాంకర్లు, ఇతర నౌకల గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) సామర్థ్యాలు మన సెల్ ఫోన్లో ఉన్న జీపీఎస్ కన్నా దారుణంగా ఉన్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఉపగ్రహ నావిగేషన్ సిగ్నల్స్ జామ్ కావడంతో గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్లోని 1,000కి పైగా నౌకలు తాము ఎక్కడ ఉన్నది తాత్కాలికంగా లేదా నిరంతరంగా గుర్తించలేకపోతున్నట్లు నిపుణులు తెలిపారు.
ఆ ప్రాంతంలో ఉన్న నౌకల్లో సగం సంఖ్యను మాత్రమే తాము ప్రస్తావిస్తున్నట్లు ఇంధన మార్కెట్ నిఘా సంస్థ కెప్లర్ విశ్లేషకుడు డిమిట్రీస్ అంపాట్జిడీస్ పేర్కొన్నారు. ఈ నౌకల్లో అత్యధికం యూఏఈ, ఒమన్ తీరానికి చేరువలో ఉన్నాయి. సమయంతోపాటు భూమికి సంకేతాలను పంపే ఉపగ్రహాల సముదాయంతో ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ రూపొందింది. దాని కచ్చితమైన స్థానాన్ని నిర్ణయించడానికి రిసీవర్ వీలు కల్పిస్తుంది.
అధునాతన స్మార్ట్ఫోన్లు ది అమెరికన్, యూరోపియన్,(గలీలియో), రష్యన్(గ్నానాస్), చైనీస్(బైదూ), గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్(జీఎన్ఎస్ఎస్) అనే నాలుగు ఉపగ్రహాల గ్రూపుల నుంచి సిగ్నల్స్ అందుకుంటాయి. జీపీఎస్ సిగ్నల్ని జామ్ చేయడం ఇప్పుడు క్లిష్టమైన పనేమీ కాదని జీపీఎస్ చరిత్రపై లిటిల్ బ్లూ డాట్ అనే పుస్తకాన్ని రచించిన క్యాథరిన్ డన్ తెలిపారు. కావలసిందల్లా అదే ఫ్రీక్వెన్సీలో ప్రసారం చేయగల బిగ్గరగా వినిపించే మరో రేడియో ట్రాన్స్మీటర్ అని ఆమె చెప్పారు.
ఇది ఉపగ్రహ సిగ్నల్స్ని అడ్డుకుంటుందని ఆమె తెలిపారు. సిగ్నల్ జామింగ్ను దాడి కోసం లేదా ఆత్మరక్షణ కోసం ఉపయోగించడం జరుగుతూనే ఉంటుందని నిపుణులు తెలిపారు. ఇరాన్ డ్రోన్ల దాడి నుంచి తప్పించుకోవడానికి గల్ఫ్ దేశాలు తమ వ్యవస్థలను ఉపయోగించుకుంటుంటే ఇతర దేశాల నౌకలను తప్పుదారి పట్టించడానికి ఇరాన్ జీపీఎస్ జామింగ్కు పాల్పడుతున్నదని వారు చెప్పారు. దీంతో కొన్ని వందల నౌకలు తాము ఎక్కడ ఉన్నదీ నిర్ధారించుకోలేని స్థితిలో పడిపోతున్నాయని వారు వివరించారు.