హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): విద్యుత్తురంగంలో డిస్కంలను ప్రైవేటీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. తాజాగా 33 కేవీ వ్యవస్థను ట్రాన్స్కోకు అప్పగించాలని కేంద్ర విద్యుత్తుశాఖ అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, విద్యుత్తుశాఖల ముఖ్య కార్యదర్శులకు ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు 132/33 కేవీ సబ్స్టేషన్ వ్యవస్థ ట్రాన్స్కోల పరిధిలో ఉంటున్నది. 33 కేవీ లైనుతోపాటు, 33/11 కేవీ సబ్స్టేషన్లు డిస్కంల పరిధిలో పనిచేస్తున్నాయి. కేంద్రం ఉత్తర్వులతో.. ఇవన్నీ ట్రాన్స్కో పరిధిలోకి వెళ్లి, వినియోగదారులకు విద్యుత్తు సరఫరా చేసే లైన్లు (11కేవీ లైన్లు), ట్రాన్స్ఫార్మర్లు మాత్రమే డిస్కంల పరిధిలో మిగులుతాయి. డిస్కంల పరిధిలో ఒక్క సబ్స్టేషన్ కూడా ఉండదు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఊరి చివరన ట్రాన్స్ఫార్మర్ ఉండి, దాని నుంచి 11 కేవీ లైను ప్రారంభమవుతుంది. అక్కడినుంచి వినియోగదారుడికి విద్యుత్తు కనెక్షన్ వరకు మాత్రమే ఇక మీదట డిస్కంలు చూసుకోవాల్సి ఉంటుంది. కేవలం వినియోగదారుల నెట్వర్క్పై మాత్రమే దృష్టిపెట్టాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యుత్తు సరఫరా, పంపిణీ నష్టాలు తగ్గుతాయని కేంద్రం వాదిస్తుండగా, డిస్కంలను ప్రైవేటీకరించేందుకే ఉత్తర్వులు జారీచేశారని విద్యుత్తు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.