న్యూఢిల్లీ: హవాలా లావాదేవీల కోసం శక్తిభోగ్ ఫుడ్స్ చైర్మన్ కేవల్ క్రుష్ణ కుమార్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఎస్బీఐతోపాటు పది బ్యాంకులను మోసగించి రూ.3,269 కోట్ల రుణం తీసుకున్నాడని అతడిపై అభియోగం. ఆదివారం రాత్రి ఆయనను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తొమ్మిది వరకు ఈడీ కస్టడీకి..
స్పెషల్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఆయనను ఈ నెల 9వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. క్రుష్ణ కుమార్ అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీలోని ఆయన నివాసంతోపాటు హర్యానాలో 9 చోట్ల ఈడీ తనిఖీలు జరిపింది.
పీఎంఎల్ఏ కింద కేసు నమోదు
బ్యాంకు రుణాల మోసం కేసులో ఆయన ఒక్కడే నిందితుడని సమాచారం. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద క్రుష్ణ కుమార్పై ఈడీ కేసు నమోదు చేసింది. ఇంతకుముందు సీబీఐ దర్యాప్తు చేసిన కేసు ఆధారంగా ఈడీ కేసు రిజిస్టర్ చేసింది.
తప్పుడు పత్రాలతో రుణాలు
తప్పుడు పత్రాలు సమర్పించి ఎస్బీఐలో క్రుష్ణకుమార్ రుణం తీసుకున్నారు. ఆయన ఖాతాను అవకతవకలు చేశాడని ఎస్బీఐ చేసిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. 24 ఏండ్ల తన కంపెనీ గోధుమ పిండి, బియ్యం, బిస్కట్లు తదితరాలు విక్రయిస్తుందని పేర్కొన్నాడు.
కొన్నేండ్లుగా ఇతర రంగాల్లోకి ప్రవేశించిందని బ్యాంకు అధికారులను నమ్మించాడు. 2008లో కంపెనీ టర్నోవర్ రూ. 1,411 కోట్లకు చేరుకుందని, 2014లో టర్నోవర్ రూ.6000 కోట్లని పేర్కొన్నాడు.
2015లోనే మొండి బాకీగా శక్తిభోగ్ రుణం
శక్తిభోగ్ ఫుడ్స్ టర్నోవర్ రూ.6000 కోట్లకు చేరుకున్న మరుసటి సంవత్సరమే ఈ సంస్థ తీసుకున్న రుణం మొండి బాకీగా మారింది. 2019లో ఈ రుణాన్ని బ్యాంకర్లు మొండి బాకీగా నిర్ణయించారు. రుణాలతో తీసుకున్న నిధులను దారి మళ్లించడాని ఈడీ అభియోగం.
శక్తిభోగ్ వివరణ ఇదీ..
వడ్ల ధరలు పడిపోవడం వల్లే తమ కంపెనీ నష్టాల పాలైందని శక్తిభోగ్ ఫుడ్స్ ప్రకటించింది. దీనిపై బ్యాంకులు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాయి. కంపెనీ వస్తువుల విలువ రూ.3000 కోట్లు ఉంటుందని, అవి పూర్తిగా దెబ్బ తిన్నాయని ఈ అడిట్లో తేలింది. తర్వాత వీటిని తక్కువ ధరలకు విక్రయించారు.