ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని బోయిసార్ పారిశ్రామిక వాడలో ఉన్న ఓ కెమికల్ కంపెనీలో ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. వేడివేడి రసాయనాలు అక్కడున్నవారిపై పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కంపెనీ లోపల మరికొందరు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
రియాక్టర్ పేలడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 18 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వెల్లడించారు. పేలుడు ధాటికి కంపెనీ పైకప్పు కూలిపోయిందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామన్నారు.