ఇఫాల్: ఈశాణ్య రాష్ట్రం మణిపూర్లో (Manipur) మరోసారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలోని ఖొయిజుమన్తాబి (Khoijumantabi) అనే గ్రామంపై సాయుధులైన దుండగులు దాడికి పాల్పడ్డారు. గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న బంకర్లపై (Bunker) దాడికి తెగబడ్డారు. ఆదివారం అర్ధరాత్రి సమీపంలోని కొండలపై నుంచి వచ్చిన దుండగులు దాడి చేశారని.. ఈ దాడిలో ముగ్గురు గ్రామ వాలంటీర్లు (Village volunteers) మరణించినట్లు పోలీసులు తెలిపారు. తాము ఘటనా స్థలానికి చేరుకునే సరికి దుండగులు అక్కడినుంచి పారిపోయారని, ఆ సమయంలో కొద్దిసేపు ఎదురుకాల్పులు జరిగాయని వెల్లడించారు. శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
కాగా, రెండు నెలల క్రితం మూసివేసిన 2వ నంబర్ జాతీయ రహదారిని కుకీ (Kuki) తెగలు తిరిగి తెరిచాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి మేరకు కంగ్పోక్పీ (Kangpokpi) జిల్లాలోని జాతీయ రహదారి (National Highway) దిగ్భంధాన్ని విరమించుకున్నట్లు కూకీ తెగలకు చెందిన యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ (UPF), కుకీ నేషనల్ ఆర్గనైజేషన్ (KNO) వెల్లడించాయి. మణిపూర్లో రెండు జాతీయ రహదారులు ఉన్నాయి. ఇంఫాల్ నుంచి దిమాపూర్ వరకు ఎన్హెచ్-2, ఇంఫాల్ నుంచి జిరిబామ్ వరకు ఎన్హెచ్ 37 ఉన్నాయి. రాష్ట్రంలో అల్లర్లు ప్రారంభమైనప్పటి నుంచి ఈ రెండు హైవేలను కుకీ తెగ నిరసనకారులు మూసివేశారు.