అహ్మదాబాద్: గుజరాత్లోని భరూచ్ పట్టణంలో ఓ ఇళ్లు కుప్పకూలింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం భరూచ్ (Bharuch) పట్టణంలోని బాంబఖానాలో ఉన్న ఓ ఇళ్లు కుప్పకూలిపోయింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు శిథిల్లాల్లో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిపామక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింది నుంచి నలుగురిని బయటకు తీసి.. దవాఖానకు తరలించారు.
అయితే వారిలో ముగ్గురు అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. మృతుల్లో ప్రిన్స్ గుజ్జర్ (14), నిషా గుజ్జర్ (10), అంజనా గుజ్జర్ (22) ఉన్నారు. గాయపడిన గాయత్రీబెన్ (18) దవాఖానలో చికిత్స పొందుతున్నదని, ప్రస్తుతం ఆమె పరిస్థితి భాగానే ఉందని పోలీసులు చెప్పారు. ప్రమాద సమయంలో వారి తల్లిదండ్రులు ఇంట్లో లేరని, పని నిమిత్తం వారు అప్పటికే వెళ్లిపోయారని తెలిపారు.