న్యూఢిల్లీ/ముంబై, జూన్ 28: అరేబియా సముద్రంలో ఓఎన్జీసీకి చెందిన పవన్హన్స్ హెలిక్టాపర్ మంగళవారం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు ఓఎన్జీసీ ఉద్యోగులతో సహా నలుగురు మరణించారు. ముంబై తీరానికి 50 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఘటన జరిగిన సమయంలో ఇద్దరు పైలట్లతో సహా హెలికాప్టర్లో తొమ్మిది మంది ఉన్నారు. జుహు హెలిబేస్ నుంచి బయలుదేరిన హెలికాప్టర్ సముద్రంలోని ఓఎన్జీసీకి చెందిన సాగర్ కిరణ్ రిగ్ వద్దకు చేరుకోవాల్సి ఉన్నది. మరో 4-5 నిమిషాల్లో అక్కడకు వెళ్తుందనగా కూలింది. అయితే హెలికాప్టర్ కూలినప్పటికీ ఫ్లోటర్ల సాయంతో సముద్రంపై తేలియాడుతూ ఉన్నది. సమాచారం అందుకున్న ఓఎన్జీసీతో పాటు నేవీ సిబ్బంది వెంటనే రెస్యూ ఆపరేషన్ చేపట్టారు. ఘటనాస్థలానికి చేరుకొని హెలికాప్టర్లోని తొమ్మిది మందిని బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న నలుగురిని దవాఖానకు తరలించగా వారు అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. అయితే ఘటన సమయంలో పశ్చిమ సముద్ర తీరంలో ప్రతికూల వాతావరణం నెలకొని ఉన్నదని అధికారులు తెలిపారు.