Doctor Ganesh | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గణేశ్ బారాయ. ఊరు గుజరాత్లోని గోరఖి అనే కుగ్రామం. ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్గా గణేశ్ రికార్డు సృష్టించాడు. ప్రతీ విజయం వెనుక ఎన్నో ఆటుపోట్లు ఉంటాయన్నట్టు.. డాక్టర్ కావాలన్న కలను చేరుకోవడానికి గణేశ్ కూడా ఎన్నో అవాంతరాలను దాటాల్సి వచ్చింది. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏకంగా సుప్రీంకోర్టు గడపతొక్కాడంటే లక్ష్యసాధనలో అతని చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
గణేశ్కి ఏడుగురు తోబుట్టువులు. తండ్రి రైతు. కుటుంబ సంపాదన అంతంతే. దీంతో గణేశ్ మినహా మిగిలినవారంతా పాఠశాల స్థాయిలోనే చదువు ఆపేశారు. అయితే, ‘మనిషి జీవితానికి సార్థకత.. తోటి మనిషికి ప్రాణంపోయడమే’ అని తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు స్కూల్లో టీచర్ చెప్పిన మాటలు గణేశ్ మనసులో బలంగా నాటుకుపోయాయి. దీంతో పెద్దయ్యాక కచ్చితంగా డాక్టర్ అయ్యి నలుగురికి ప్రాణదాతగా మారాలని నిర్ణయించుకొన్నాడు. ‘తానొకటి తలిస్తే, దైవం మరొకటి తలిచింద’న్నట్టు పుట్టుకతోనే లోకోమోటివ్ సమస్యను ఎదుర్కొంటున్న గణేశ్కు వయసు పెరిగిన కొద్దీ ఆ వ్యాధి పెరుగడం ప్రారంభించింది. దీంతో 23 ఏండ్ల వయసొచ్చినా.. అతని ఎత్తు 3 అడుగులు, బరువు 18 కిలోలు మాత్రమే ఉండేది.
స్కూల్, కాలేజీలో గురువులు, తోటి విద్యార్థుల సహకారం ఉండటంతో తన పరిస్థితి గురించి గణేశ్ ఎప్పుడూ బాధపడలేదు. చక్కగా చదువుకొని ఇంటర్లో 87 శాతం మార్కులు, 2018లో రాసిన నీట్ పరీక్షలో 233 మార్కులను గణేశ్ సాధించి డాక్టర్ కావాలన్న తన కలను సాధించుకోవడానికి ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం కౌన్సిలింగ్కు హాజరయ్యాడు. ఇక్కడే, అతనికి ఊహించని పరిణామం ఎదురైంది. ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు వచ్చినప్పటికీ, ఎత్తు తక్కువగా ఉందన్న కారణంతో వైద్య కళాశాలలో ప్రవేశానికి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (ఎంసీఐ) నిరాకరించింది. అయితే భావ్నగర్ కలెక్టర్, స్కూల్ టీచర్లు, విద్యామంత్రి సలహా మేరకు కౌన్సిల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గణేశ్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే అక్కడ చుక్కెదురైంది. అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. గణేశ్ పక్షాన కోర్టు నిలిచింది. దివ్యాంగుల హక్కుల చట్టం, 2016 ప్రకారం.. గణేశ్కు వైద్య కళాశాలలో ప్రవేశం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఒక ఏడాది చేజారిపోయినప్పటికీ, ఎట్టకేలకు 2019లో ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకొన్న గణేశ్.. మెడికల్ విద్యను ఇటీవలే విజయవంతంగా పూర్తి చేసి, ప్రస్తుతం భావ్నగర్లోని ఓ దవాఖానలో ఇంటర్న్ డాక్టర్గా సేవలందిస్తూ తన కలను సాకారం చేసుకొన్నాడు.