Srinagar | ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను హౌజ్ అరెస్ట్ చేసింది జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం. నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ప్రతిపాదనలను నిరసిస్తూ చేపట్టాలని నిర్ణయించుకున్న కారణంగానే వారిని హౌజ్అ అరెస్ట్ చేశారు. తాజాగా జరిగిన నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ గుప్కార్ అలయెన్స్ తరపున నిరసనకు దిగుతామని మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారిని హౌజ్ అరెస్ట్ చేశారు. వారి వారి ఇళ్ల వద్ద, అటు వైపు వెళ్లే రోడ్ల వద్ద గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు. ‘శుభోదయం.. 2022 సంవత్సరానికి స్వాగతం. ఎప్పటి లాగే ప్రభుత్వం అక్రమంగా ప్రజల్ని ఇంట్లో బంధించేశారు. శాంతియుతంగా నిరసన చేద్దామనుకున్న మా ఇళ్ల ముందు పోలీసు వాహనాలతో గస్తీ కాస్తున్నారు’ అంటూ ఒమర్ తీవ్రంగా మండిపడ్డారు.
జమ్మూ కశ్మీర్లో ప్రస్తుతం 83 నియోజకవర్గాలున్నాయి. వాటిని 90 కి పెంచాలని నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ప్రతిపాదించింది. జమ్మూలో ప్రస్తుతం 37 సీట్లుండగా, వాటికి అదనంగా మరో 7 సీట్లను పెంచాలని, కశ్మీర్లో 46 సీట్లకు అదనంగా మరో కొత్త సీటును పెంచాలని కమిషన్ ప్రతిపాదించింది.