పట్నా: బీహార్లో కల్తీమద్యం మరోసారి కలకలం రేపింది. గత నెలలో కల్తీ మద్యం సేవించి రాష్ట్రంలో పది మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా సివాన్ జిల్లాలోని గ్రామంలో కల్తీ మద్యం తాగడంతో ముగ్గురు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్ర అస్వస్తతకు గురయ్యారు. బాధితులు సివాన్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్నారని జిల్లా మేజిస్ట్రేట్ అమిత్ కుమార్ పాండే తెలిపారు. అనుమానాస్పద స్థితిలో ముగ్గురు మృతిచెందారని, మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. వారి మరణానికి స్పష్టమైన కారణాలు తెలియలేదని, దర్యాప్తు అనంతరం అసలు విషయం తెలియనుందని వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటివరకు 10 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
కాగా, గతేడాది డిసెంబర్ నెలలో ఛాప్రా జిల్లాలో కల్తీ మద్యం వల్ల 70 మంది మరణించారు. లిక్కర్ను స్మగ్లింగ్ చేస్తున్న పలువురిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అరెస్టు చేసింది. వారి నుంచి రూ.2.17 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కల్తీ మద్యం సేవించి మరణించినవారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందదని సీఎం నితీశ్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే.