భోపాల్ : అక్రిడేషన్ ఉన్నా లేకున్నా కొవిడ్-19 బారిన పడిన జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య అందించనున్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం తెలిపారు. ఈ వారం ప్రారంభంలోనే చౌహాన్ జర్నలిస్టులను కరోనా వారియర్స్ ఫ్రంట్లైన్ వర్కర్స్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. జర్నలిస్టులు వారి విధులను నిర్వర్తించే క్రమంలో కొవిడ్ బారిన పడటం, దురదృష్టవశాత్తు కొందరు చనిపోవడం ఇటీవల మనం చూసిందేనని ఓ ప్రకటనలో సీఎం తెలిపారు.
అయితే నేటి నుంచి అక్రిడేటెడ్, నాన్ అక్రిడేటెడ్ జర్నలిస్టులు, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నవారు కొవిడ్కు గురైతే వారి సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చెప్పారు. ఈ చర్య జర్నలిస్టులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో సహాయపడుతుందని అదేవిధంగా వారి మెరుగైన చికిత్సను కూడా నిర్ధారిస్తుందని ఆయన పేర్కొన్నారు.