న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులు తమకు తెలియకుండానే డీజీ యాత్రకు (Digi Yatra) సమ్మతి తెలిపారు. దీనిపై జరిగిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఈ సేవ గురించి అవగాహన కల్పించకుండా ప్రయాణికుల నుంచి బయోమెట్రిక్ సేకరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. విమానాశ్రయాల్లోని వివిధ చెక్పోస్టుల వద్ద ప్రయాణికుల కాంటాక్ట్లెస్ మూవ్మెంట్ కోసం డీజీ యాత్ర అనే మొబైల్ అప్లికేషన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వే ప్రకారం గత ఆరు నెలలుగా ఢిల్లీ విమానాశ్రయంలో డీజీ యాత్ర కోసం సైన్ అప్ చేసిన విమాన ప్రయాణికుల్లో 29 శాతం మంది తమకు తెలియకుండానే అది పూర్తి చేశారు.
కాగా, డీజీ యాత్ర గురించి అవగాహన కల్పించకుండా, ప్రయాణికుల అనుమతి లేకుండా బయోమెట్రిక్ డేటా సేకరించడంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అలాగే విమాన ప్రయాణికుల అనుమతి లేకుండా బయోమెట్రిక్ డేటా సేకరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్కు చెందిన రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే విమర్శించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై ఆయన మండిపడ్డారు.
మరోవైపు టీఎంసీ ఎంపీ గోఖలే విమర్శలను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఖండించారు. డీజీ యాత్ర పూర్తిగా స్వచ్ఛందమని తెలిపారు. విమాన ప్రయాణికుల సమ్మతితో మాత్రమే వారి డేటా సేకరించాలని ఎయిర్పోర్ట్స్లోని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. డీజీ యాత్ర కోసం సేకరించిన ప్రయాణికుల డేటా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో స్టోర్ చేస్తారని వెల్లడించారు.