మథుర: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర జిల్లాలో దారుణం జరిగింది. ఒకే లారీలో 30 గోవులను కుక్కి తరలిస్తుండగా ఊపిరాడక 29 ఆవులు మృతిచెందాయి. మథుర జిల్లాలో జాతీయ రహదారిపై ఓ లారీ ఆగి ఉందని, దాని నిండా ఆవులు కుక్కి ఉన్నాయని మథుర సర్కిల్ పోలీసులకు సమాచారం అందింది. దాంతో సర్కిల్ ఆఫీసర్ హర్షిత సింగ్ నేతృత్వంలోని పోలీస్ బృందం వెంటనే అక్కడికి చేరుకుంది.
లారీలోని ఆవులను పరిశీలించగా 29 ఆవులు మృతిచెంది ఉన్నాయి. కేవలం ఒక్కటి మాత్రమే ప్రాణాలతో ఉన్నది. లారీ డ్రైవర్ పారిపోయాడు. ఆవులు మృతిచెందిన విషయాన్ని గమనించే డ్రైవర్ లారీని ఆపేసి పారిపోయి ఉంటాడని పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.