ముంబై: మహారాష్ట్ర(Maharashtra)కు చెందిన ఓ సీనియర్ అధికారి కుమారుడు.. తన గర్ల్ఫ్రెండ్ను చిత్రహింసలకు గురి చేశాడు. మిత్రులతో కలిసి ఆమెను కొట్టి.. ఆమెపై డ్రైవర్తో కారెక్కించాడు. ఈ ఘటన థానేలో జరిగింది. ప్రియా సింగ్ అనే 26 ఏళ్ల మహిళ తనపై జరిగిన దాడి గురించి ఇన్స్టాలో పోస్టు పెట్టింది. చావుదెబ్బలు కొట్టి.. కారెక్కించిన ఫోటోలను ఆమె అప్లోడ్ చేసింది. ఓ వాగ్వాదం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆమె తన కథనంలో పేర్కొన్నది. థానేలో ఉన్న ఓ హోటల్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గైక్వాడ్ కుమారుడు అశ్వజిత్ గైక్వాడ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. గత అయిదేళ్ల నుంచి అశ్వజిత్, ప్రియా మధ్య రిలేషన్ ఉంది. ఓ ఫ్యామిలీ ఫంక్షన్కు రావాలంటూ ప్రియాను అశ్వజిత్ ఆహ్వానించాడు. ఆ ఈవెంట్కు వెళ్లిన ఆమెపై ఫ్రెండ్స్తో కలిసి అతను దురుసగా ప్రవర్తించాడు.
అయితే ప్రైవేట్గా మాట్లాడాలి అంటూ పక్కకు వెళ్లినా.. బాయ్ఫ్రెండ్ వచ్చి దాడి చేసినట్లు ఆమె తన పోస్టులో చెప్పింది. స్నేహితుడితో కలిసి భాయ్ఫ్రెండ్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, తనను తిట్టవద్దు అని చెప్పినా వినిపించుకోలేదని, తనపై భాయ్ఫ్రెండ్ చేయి చేసుకున్నాడని, తన గొంతును నొక్కే ప్రయత్నం చేశాడని, అతన్ని తోసి వేయడంతో.. తనను కొట్టాడని, అతని స్నేహితుడు కూడా తనను కిందపడేశాడని ప్రియా తన పోస్టులో తెలిపింది.
కారులో ఉన్న ఫోన్ తీసుకునేందుకు వెళ్తున్న సమయంలో.. డ్రైవర్తో కారును తనపై ఎక్కించినట్లు ప్రియా తన ఫిర్యాదులో పేర్కొన్నది. నొప్పులతోనే అరగంటకుపైగా రోడ్డుపై పడి ఉన్నానని, ఆ తర్వాత ఓ వ్యక్తి వచ్చి తనకు హెల్ప్ చేసినట్లు ఆమె చెప్పింది. ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో ప్రియా చికిత్స పొందుతోంది. ఈ ఘటన పట్ల పోలీసులు విచారణ చేపట్టారు. ఇంత వరకు ఎవర్నీ అరెస్టు చేయలేదు.