ఐఎస్ఐఎస్ అగ్రనేత అల్ఖురేషీని అమెరికా దళాలు మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్ స్వయంగా ప్రకటించారు. అల్ఖురీషి లక్ష్యంగా అమెరికన్ కౌంటర్ టెర్రరిజం దళాలు నార్త్ వెస్ట్ సిరియాలో దాడులు చేశాయని తెలిపారు. ఈ దాడులను అమెరికా దళాలు చాలా పకడ్బందీగా నిర్వహించినట్లు అర్థమవుతోంది. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో హెలికాప్టర్ల ద్వారా అల్ఖురేషీ స్థావరంపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో తాము హెలికాప్టర్ల శబ్దాలను విన్నామని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఆపరేషన్లో మొత్తం 24 మంది మెరికల్లాంటి అమెరికన్ కమాండోలు పాల్గొన్నారు. అర్ధరాత్రి ఒంటి గంటల సమయంలో ఈ 24 మంది కమాండోలు సిరియాలోని అత్మెహా ప్రాంతానికి చేరుకొని, దాడులు చేసినట్లు తెలుస్తోంది.
న్యూయార్క్ టైమ్స్ రిపోర్టుల ప్రకారం రాత్రి 11 గంటల నుంచే పరిసర ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రజలను ఖాళీ చేయమని ప్రకటించారు. ముందుగా మహిళలను, పిల్లలను ఖాళీ చేయించారు. ఇదంతా ముగియడానికి ఓ రెండు గంటల సమయం పట్టింది. అంతా సెట్ అయిన తర్వాత అర్ధరాత్రి 1 గంటలకు ఐఎస్ ఐఎస్ అగ్రనేత అల్ఖురేషీ టార్గెట్గా ఆపరేషన్ను ప్రారంభించారు. అల్ఖురేషీ తలదాచుకున్న ఇంటిపై అమెరికన్ కమాండోలు గ్రనైడ్ల దాడి చేసినట్లు తెలుస్తోంది. దీని తర్వాతే ఫైరింగ్ ప్రారంభించారు. ఇరు వర్గాల మధ్య భీకరమైన కాల్పులు కూడా జరిగాయి. దీంతో పరిసర ప్రాంతంలోని కొన్ని గృహాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో ఐఎస్ఐఎస్ అగ్రనేత అల్ఖురేషీ ఖతమయ్యాడని నిర్ధారించుకున్న తర్వాతే అమెరికన్ కమాండోలు తమ తమ హెలికాప్టర్లలో అక్కడి నుంచి నిష్క్రమించారు. అల్ఖురేషీని మట్టుబెట్టగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమెరికా కమాండోలు హెలికాప్టర్ల ద్వారా అమెరికాకు తిరుగుపయనమయ్యారు.