జెడ్డా: అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సూడాన్ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది. ఆపరేషన్ కావేరీలో (Operation Kaveri) భాగంగా భారతీయ పౌరులతో కూడిన 12వ విమానం సౌదీఅరెబియాలోని జెడ్డా (Jeddah) నుంచి ముంబై (Mumbai) బయల్దేరింది. ఇండియన్ ఎయిర్ఫోర్సుకు (IAF) చెందిన ఈ విమానంలో 231 మంది స్వదేశానికి తిరిగివస్తున్నారని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బగ్చీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మంగళవారం రాత్రి 328 మంది సూడాన్ నుంచి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో ఇప్పటివరకు 3 వేల మందిని క్షేమంగా తరలించామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) తెలిపారు.
సూడాన్లో అధికారం కోసం సైన్యంలోని రెండు గ్రూపులు ఏప్రిల్ 15 నుంచి పోరాడుతున్నాయి. దీంతో దేశంలో అశాంతి నెలకొన్నది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 24న ఆపరేషన్ కావేరీని ప్రారంభించింది. ఇప్పటివరకు 11 విమానాల్లో సూడాన్ను భారతపౌరులను స్వదేశానికి తీసుకొచ్చారు.
"12th outbound flight departs from Jeddah. 231 passengers are heading to Mumbai", tweets MEA spokesperson Arindam Bagchi#OperationKaveri
(Pic credits – Arindam Bagchi's Twitter handle) pic.twitter.com/7BZhNeMqGt
— ANI (@ANI) May 3, 2023
కాగా, ఏప్రిల్ 15న సూడాన్ సాధారణ మిలిటరీ, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(RSF) అని పిలిచే పారామిలిటరీ బలగాల మధ్య ప్రారంభమైన ఆధిపత్య పోరాటం వల్ల ఇప్పటివరకు 3 లక్షల 30 వేల మందికి పైగా ప్రజలు వారివారి స్వదేశాలకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి (United Nations) వెల్లడించింది. మరో లక్ష మందికిపైగా సరిహద్దులు దాటి పారిపోయారని తెలిపింది. మొత్తంగా దేశం నుంచి 4 లక్షల 30 వేల మందికిపైగా దేశం నుంచి వెళ్లిపోయారని పేర్కొన్నది.