బేండ్: మధ్యప్రదేశ్ ( Madhya Pradesh ) లోని బేండ్ ( Bhind ) జిల్లాలో ఉన్న ఓ జైలులో గోడ కూలింది. ఈ ఘటనలో 22 మంది ఖైదీలు గాయపడ్డారు. బరాక్ నెంబర్ 6 వద్ద ఉన్న గోడ ఇవాళ ఉదయం 5.10 నిమిషాలకు కూలినట్లు జైలు అధికారులు తెలిపారు. ఆ బరాక్లో ఉన్న ఓ ఖైదీ తీవ్రంగా గాయపడినట్లు ఎస్పీ మనోజ్ చెప్పారు. అతన్ని గ్వాలియర్ దవాఖానకు తరలించారు. గోడ కూలిన ఘటన చోటుచేసుకున్న సమయంలో జైలులో సుమారు 255 మంది ఖైదీలు ఉన్నట్లు సమాచారం. సమాచారం రాగానే రెస్క్యూ ఆపరేషన్ కోసం అదనపు బలగాలను పంపినట్లు ఎస్పీ మనోజ్ తెలిపారు. జైలు బిల్డింగ్ చాలా పురాతనమైంది కావడంతో.. నిరాటంకంగా కురుస్తున్న వర్షాల వల్ల కూలినట్లు అంచనా వేస్తున్నారు.