India Population | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): జనాభాలో చైనాను భారత్ అధిగమించింది. 142.86 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలిచింది. అయితే, జనాభాపరంగా ప్రపంచ దేశాలకు పెద్దన్నగా మారిన ఇండియాకు భవిష్యత్తులో కొన్ని సవాళ్లు ఎదురుకానున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటివరకూ జనాభాలో రెండోస్థానంలో ఉన్న భారత్.. తొలిస్థానంలోకి వచ్చింది. అయితే, భూవిస్తీర్ణంలో మాత్రం ఏడో స్థానం మాత్రం మారలేదు. కారణం.. జనాభా పెరిగినా.. భూభాగం పెరుగదు. భారత భూభాగ విస్తీర్ణం 29.7 లక్షల చదరపు కిలోమీటర్లుగా ఉన్నది. 2000లో దేశంలో చదరపు కిలోమీటరుకు జనసాంద్రత 322గా ఉంటే, ప్రస్తుతం 480కి చేరింది. 2050నాటికి 600 వరకు చేరొచ్చన్న అంచనాలు ఉన్నాయి. అంటే, మరికొన్ని దశాబ్దాల్లో నివాసానికి తగినంత భూమి లభించని పరిస్థితులు తలెత్తవచ్చు.
ప్రపంచం జనాభాలో భారత్ వాటా 18 శాతం. కానీ ప్రపంచ జల సంపదలో మన వాటా 4 శాతమే. దేశంలోని దాదాపు 80 శాతం పల్లెల్లో, 60 శాతం పట్టణాలు, నగరాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది.
దేశంలోని ప్రతి పదిమందిలో ఇప్పటికీ ముగ్గురికి చదువు రాదు. డిగ్రీ పట్టాలు అందుకొన్నప్పటికీ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోనివారు లక్షల్లో ఉన్నారు. వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలి. లేదంటే ప్రస్తుతం భారత్కు బలంగా మారిన ఆ యువతరమే బలహీనతగా మారే ప్రమాదమున్నది.
ఏటా లక్షల సంఖ్యలో యువత శ్రామిక శక్తిగా మారుతున్నది. వీరికి తగిన ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉంది. ప్రస్తుతం 22 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది.
జనాభా పెరుగడంవల్ల భూమి, నీటి సమస్యలు తలెత్తడంతో అడవులపై ప్రభావం పడుతుంది. దీంతో పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి. ఫలితంగా ప్రకృతి విపత్తులు సంభవించవచ్చు. భూ, జల, వాయు కాలుష్యానికి జనాభా పెరిగిపోవడమే కారణమని నిపుణులు చెబుతున్నారు.
దేశ జనాభాలో ఇప్పుడు సగం వాటాను ఆక్రమించిన యువతరం మరో మూడు దశాబ్దాల్లో వృద్ధుల క్యాటగిరీలోకి చేరుతారు. వారి సంక్షేమంపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఖజానాపై ఇది అదనపు భారమే. పైగా శ్రామికశక్తి నుంచి ఈ వర్గం బయటకి వెళ్లిపోవడంతో దేశ ఉత్పాదకశక్తి కూడా తగ్గిపోతుంది.
ముంబై వంటి మహానగరాల్లో చదరపు మైలుకు 70 వేలమంది వరకు నివసిస్తున్నారు. దీంతో నగరమంతా కిక్కిరిసినట్టు తయారైంది. జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉన్నది.
పాకిస్థాన్ వంటి దేశంలో ప్రతి వెయ్యిమంది జనాభాకు ఒక వైద్యుడు అందుబాటులో ఉంటే, మనదగ్గర ప్రతి రెండు వేల మందికి కూడా సరైన డాక్డర్ లేడు. కరోనా వంటి వైరస్లు భవిష్యత్తులో మళ్లీ పడగవిప్పితే దేశానికి నష్టమే.
దేశంలో ప్రస్తుతమున్న నదీ జలాలు, అటవీ సంపద, బొగ్గు తదితరాలు భవిష్యత్తు జనాభా అవసరాలకు ఏమాత్రం సరిపోయే విధంగా లేవు. దీంతో అటవీ విస్తీర్ణాన్ని పెంచుతూ.. నదీ జలాల్ని సాధ్యమైనంతవరకు కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. పవన, జల, సౌర విద్యుత్తు ఉత్పత్తిని మరింతగా ప్రోత్సహించాలి.
పట్టణీకరణ పెరగడంతో వ్యవసాయం కుంటు పడే ప్రమాదమూ లేకపోలేదు. ఇది ఆహారసంక్షోభానికి దారి తీయొచ్చు. సాగుకు ప్రోత్సాహకాలివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.