న్యూఢిల్లీ: బీహార్ రాజధాని పాట్నాలో 2013లో జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో నిందుతులైన నలుగురికి ఎన్ఐఏ కోర్టు మరణశిక్షను విధించింది. 9 మంది దోషుల్లో ఇద్దరికి జీవితకాల శిక్షను అమలు చేయనున్నారు. మరో ఇద్దరికి 10 ఏళ్ల జైలుశిక్ష పడింది. ఒకరికి ఏడేళ్ల శిక్షను విధించారు. 2013 సీరియల్ బ్లాస్ట్ కేసులో మొత్తం 10 మందిని ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. ప్రస్తుత ప్రధాని మోదీ అప్పట్లో గుజరాత్ సీఎం హోదాలో ఓ ఎన్నికల సభను నిర్వహించారు. అయితే ఆ సభను టార్గెట్ చేస్తూ వేదిక వద్ద పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్ల వల్ల ఆరుగురు మృతిచెందారు. ఈ కేసులో ఎన్ఐఏ జడ్జి గుర్విందర్ మెహరోత్రా తీర్పును వెలువరించారు. విచారణ సమయంలో కోర్టు 11 మందిపై ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇంతియాజ్ అన్సారీ, ముజీబుల్లా, హైదర్ అలీ, ఫిరోజ్ అస్లమ్, ఒమర్ అన్సారీ, ఇఫ్తికర్, అహ్మద్ హుస్సేన్, ఉమర్ సిద్ధిఖి, అజారుద్దీన్లకు శిక్షలను ఖరారు చేశారు. ఫక్రుద్దీన్ను నిర్దోషిగా ప్రకటించారు.