(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ ‘ఆయుష్మాన్ భారత్’ పథకం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో 120 ప్రైవేటు దవాఖానలు నకిలీ బిల్లులతో రూ.200 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టు అధికారుల విచారణలో బట్టబయలైంది. ఓ హిందీ జాతీయ పత్రిక కథనం ప్రకారం మధ్యప్రదేశ్లో ఇండోర్, భోపాల్, గ్వాలియర్, జబల్పూర్తో పాటు పలు ఇతర పట్టణాల్లోని పేరుగాంచిన ప్రైవేటు దవాఖానలు ఈ కుంభకోణానికి పాల్పడ్డాయి.
స్కామ్ విషయం బయటకు పొక్కడంతో సీఎం శివరాజ్ సింగ్ ప్రభుత్వం భోపాల్, జబల్పూర్లోని కొన్ని ప్రైవేటు దవాఖానలపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నది. అయితే ఈ స్కామ్లో ఇంకా పలు కార్పొరేట్ హాస్పిటల్స్ పాత్ర కూడా ఉన్నదని, వాటి వెనుక పెద్ద తలకాయలున్నట్టు అధికారుల విచారణలో తేలినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో మరో 15 ప్రైవేటు దవాఖానలకు అధికారులు తాజాగా నోటీసులు జారీచేశారు. అయితే ఈ స్కామ్కు పాల్పడిన వారిని గుర్తించి, అరెస్టులు చేయకుండా.. దోచుకొన్న డబ్బును తిరిగి వసూలు చేయడానికి మాత్రమే బీజేపీ ప్రభుత్వం మార్గాలు వెతుకుతున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి. 2019 నుంచి 2022 జూలై వరకు ప్రభుత్వం 620 ప్రైవేటు దవాఖానలకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద దాదాపు రూ.1,050 కోట్లు చెల్లించిందని అధికారులు లెక్కలు తేల్చారు.
విచారణలో విస్తుగొల్పే విషయాలు..
తీగ లాగితే డొంకంతా కదిలినట్టు.. అధికారుల విచారణలో విస్తుగొల్పే విషయాలు బయటకు వస్తున్నాయి. దవాఖానల్లో పనిచేసే సిబ్బందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు తయారు చేయించి, వారికి వైద్యం చేయకున్నా.. చేసినట్టు దొంగ బిల్లులు సృష్టించారు. వాస్తవానికి ఒక రోగికి రూ.50 వేల బిల్లు అయితే.. చేయని వైద్యానికి బిల్లులు వేసి దాన్ని కలిపి డబ్బులు దండుకొన్న ఘటనలు బయటపడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని, వారి ద్వారా రోగులను తమ దవాఖానలకు వచ్చేలా చేసి కోట్ల రూపాయాలు దండుకొన్న పలు దవాఖానల లీలలు వెలుగులోకి వచ్చాయి.