Covid Vaccination | కరోనా మహమ్మారి ఆట కట్టించడానికి దేశ జనాభాలో 20 శాతం యువజనం పూర్తిగా వ్యాక్సినేషన్ చేయించుకున్నారని కేంద్రం గురువారం ప్రకటించింది. 62 శాతం మంది సింగిల్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారని తెలిపింది. 99 శాతం హెల్త్ కేర్ వర్కర్లు తొలి డోస్, 82 శాతం మంది సెకండ్ డోస్ తీసుకున్నారని పేర్కొంది. 100 శాతం ఫ్రంట్లైన్ వర్కర్లు ఫస్ట్ డోస్.. వారిలో 78 శాతం మంది సెకండ్ డోస్ తీసుకున్నారని వివరించింది.
కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ప్రకారం సగటున మే నెలలో 19.69 లక్షల మందికి రోజువారీగా టీకాలు వేశారు. జూన్లో అది 39.89 లక్షలకు, జూలైలో 43.41 లక్షలకు, ఆగస్టులో 59.19 లక్షల మందికి చేరుకుంది. సెప్టెంబర్ తొలి 15 రోజుల్లో సగటున 74.40 లక్షల మందికి వ్యాక్సినేషన్ జరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.
పండుగల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజలు ఆచితూచి వ్యవహరించాలని హెచ్చరించింది. వ్యాక్సినేషన్తోపాటు కోవిడ్-19 మార్గదర్శకాలను తప్పక పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి వచ్చే రెండు, మూడు నెలలు చాలా కీలకం అని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ తెలిపారు.
భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ బలరామ్ భార్గవ మాట్లాడుతూ పండుగల సమయంలో జనం ఒకచోట గుమి కూడతారని, దీనివల్ల వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుందన్నారు.