Kotia Cluster | కొటియా: ఏపీ, ఒడిశాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 21 గ్రామాలతో కూడిన కొటియా క్లస్టర్ కథ చర్చనీయాంశంగా మారింది. ఏపీ, ఒడిశాల సరిహద్దుల్లో, విశాఖపట్నానికి 150 కిలోమీటర్ల దూరంలోని మారుమూల కొండల్లో బ్రిటీష్ కాలం నుంచి నలుగుతున్న ఈ వివాదాస్పద గ్రామాలు ఉంటాయి. ఇక్కడ అందరికీ రెండు ఓటు కార్డులతోపాటు రెండు రేషన్ కార్డులు కూడా ఉంటాయి. దీంతో వీరికి రెండు ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అందుతుంటాయి.
ఈ క్లస్టర్ ప్రజలు రెండు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతోపాటుగా, రెండు రాష్ర్టాల పరిధిలోకి లోక్సభ ఎన్నికల్లోనూ ఓటు వేస్తారు. ఈ 21 గ్రామాలు ఒడిశాలో కోరాపుట్ లోక్సభ, పొత్తంగి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. అదేవిధంగా ఇవే గ్రామాలు ఏపీలోని అరకు లోక్సభ, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఉంటాయి. ఇదొక విచిత్రమైన పరిస్థితి అని, తక్షణ పరిష్కారం సాధ్యం కాదని ఎన్నికల అధికారులు అంటున్నారు.