శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఇవాళ ఉగ్రవాదులు ఇద్దరు ప్రభుత్వ టీచర్లను చంపేశారు. దాంట్లో ఓ మహిళ టీచర్ ఉన్నది. ఒకరు కశ్మీరీ పండిట్ కాగా, మరొకరు సిక్కు మహిళగా గుర్తించారు. శ్రీనగర్ జిల్లాలోని సంఘం ఈద్గా వద్ద ఇద్దరు స్కూల్ టీచర్లను ఉదయం 11.15 నిమిషాలకు హతమార్చారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని మూసివేశామని, ఉగ్రవాదుల కోసం అన్వేషిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా.. టీచర్ల హత్య ఘటనను ఖండించారు. అనాగరిక చర్యకు టీచర్లు బలయ్యారని, వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు ఒమర్ ఓ ట్వీట్ చేశారు.
మంగళవారం కూడా ఉగ్రవాదులు ఓ కశ్మీరీ పండిట్ను చంపిన విషయం తెలిసిందే. శ్రీనగర్లోని ఇక్బాల్ పార్క్లో ఉన్న ఓ ఫార్మసీ షాపు ఓనర్ 70 ఏళ్ల మఖన్ లాల్ బింద్రూను ఉగ్రవాదులు కాల్చి చంపారు. రాత్రి ఏడు గంటల సమయంలో పాయింట్ బ్లాంక్ రేంజ్లో అతన్ని కాల్చారు. కశ్మీరీ పండిట్ బింద్రూ.. 1990 దశకంలో.. ఉగ్రవాదం హెచ్చు స్థాయిలో ఉన్న సమయంలోనూ ఫార్మసీ నడిపారు.
ఉగ్రవాదుల కాల్పుల్లో మంగళవారం మృతిచెందిన వారిలో ఓ వీధి వ్యాపారి ఉన్నాడు. బండిపురాలో ట్యాక్సీస్టాండ్ అధ్యక్షుడు మహమ్మద్ షఫీని కూడా ఉగ్రవాదులు చంపేశారు. వీధి వ్యాపారిని బీహార్కు చెందిన వీరేంద్ర పాశ్వాన్గా గుర్తించారు.