లక్నో: ఏడు నెలల వయసున్న పసికందు కడుపులో రెండు కిలోల బరువైన పిండం ఉన్నది (foetus in infant’s stomach). వైద్య పరీక్షల ద్వారా దీనిని గుర్తించిన డాక్టర్లు సర్జరీ చేసి తొలగించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ సంఘటన జరిగింది. ప్రతాప్గఢ్ జిల్లా కుంట ప్రాంతానికి చెందిన రైతు భార్య కొన్ని నెలల కిందట ఒక బాబుకు జన్మనిచ్చి చనిపోయింది. ప్రస్తుతం ఏడు నెలల వయసున్న ఆ పసికందు కడుపు ఉబ్బుతున్నది. దీంతో కడుపు నొప్పితో బాబు అల్లాడిపోయాడు. ఈ నేపథ్యంలో జూలై 24న తండ్రి ఆ శిశువును స్వరూప్ రాణి నెహ్రూ హాస్పిటల్కు తీసుకెళ్లాడు. సీటీ స్కాన్ చేసిన వైద్యులు ఆ పసికందు కడుపులో పిండం పెరుగుతున్నట్లు గ్రహించారు.
కాగా, ప్రయాగ్రాజ్లోని సరోజినీ నాయుడు పిల్లల ఆసుపత్రి డాక్టర్లు కూడా ఆ శిశువును పరిశీలించారు. ఆ పసి బాబు కడుపులో రెండు కిలోల బరువున్న పిండం ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ కుమార్ నేతృత్వంలోని వైద్యుల బృందం సర్జరీ చేశారు. నాలుగు గంటలు శ్రమించి ఆ చిన్నారి కడుపులోని పిండాన్ని తొలగించారు. శిశువు కడుపులో పిండం ఉండటం చాలా అరుదైన సంఘటన అని డాక్టర్ కుమార్ తెలిపారు. తల్లి గర్భంలో కవలలు ఏర్పడినప్పుడు, కొన్ని సందర్భాల్లో ఒక పిండం కవల పిల్ల కడుపులో పెరుగుతుందని అన్నారు. వైద్యపరంగా ఫీటస్ ఇన్ ఫీటూ అని వ్యవహరిస్తారని చెప్పారు.