న్యూఢిల్లీ, మే 23: ఇండియాలో తొలిసారి వెలుగుచూసిన డబుల్ మ్యుటెంట్ వైరస్, యూకేలోని కెంట్ రకం వైరస్పై టీకాలు పనిచేస్తాయా.. లేదా.. చేస్తే ఏ మేరకు రక్షణ కల్పిస్తాయి.. అన్న విషయంపై ఇంగ్లండ్ వైద్య నిపుణులు స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం ఉన్న కరోనా టీకాలు రెండు డోసులు వేసుకొంటే ఈ రెండు రకాల వైరస్ల నుంచి రక్షణ లభిస్తున్నదని తెలిపారు. డబుల్ మ్యుటెంట్ వైరస్పై ఫైజర్ టీకా 88%, అస్ట్రాజెనెకా టీకా 60% సమర్థంగా పనిచేస్తున్నదని ఇంగ్లండ్ ప్రభుత్వ వైద్య విభాగం అధ్యయనంలో వెల్లడైంది. అదే సమయంలో కెంట్ రకంపై ఇది 93 శాతం, 66 శాతంగా ఉన్నది. అదే ఒక్క డోసు మాత్రమే వేసుకొంటే డబుల్ మ్యుటెంట్ నుంచి 33%, కెంట్ రకం నుంచి 50శాతం మాత్రమే రక్షణ లభిస్తుందని తేలింది.