ముంబై: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం రూ. 19 వేల కోట్లను కేంద్రం కేటాయించింది. మహారాష్ట్రలోని ముంబై, పుణెలో మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ రైల్వే ప్రాజెక్టులు చేపట్టడానికి రూ. 729.55 కోట్లను వెచ్చించనుంది. ఈ మేరకు కేంద్రం బుధవారం బడ్జెట్ పత్రాలను విడుదల చేసింది. 2022-23 ఏడాదికి గానూ కోల్కతా మెట్రో రైల్వే కార్పొరేషన్ (కేఎంఆర్సీ)కి బడ్జెట్లో రూ. 1,100 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 22.22 శాతం ఎక్కువ. రైల్వే అభివృద్ధి పనుల నిమిత్తం ఒడిశాకు రూ. 9,734 కోట్లను అలొకేట్ చేశారు. గతేడాదితో పోలిస్తే ఇది రూ. 2,738.5 కోట్లు ఎక్కువ. రానున్న మూడేండ్లలో ప్రారంభించనున్న 400 వందే-భారత్ రైళ్లను తయారుచేసే ప్రాజెక్టుకు బాంబార్డియార్, సీమెన్స్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ తదితర సంస్థలు పోటీ పడుతున్నట్టు అధికారులు తెలిపారు.