ముంబై: ఒక స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘర్షణలో 19 మంది పోలీసులు గాయపడ్డారు. 12కు పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బోయిసర్ పట్టణం పారిశ్రామిక ప్రాంతంలోని ఉక్క కర్మాగారానికి చెందిన ఉద్యోగులు శనివారం ఆందోళనకు దిగారు. ఒక కార్మిక సంఘానికి చెందిన సుమారు వంద మంది ఫ్యాక్టరీలోకి చొచ్చుకెళ్లారు. కొందరు ఉద్యోగులపై దాడి చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రాంగణంలో అలజడి సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. దీంతో అల్లర్లకు దిగిన కార్మికులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘర్షణలో 19 మంది పోలీసులు గాయపడ్డారు. 12కు పైగా పోలీస్ వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.
కాగా, హింసాత్మక ఘటనలకు పాల్పడిన 27 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లర్లు, హత్యాయత్నం వంటి కేసులు నమోదు చేశారు. ఉక్కు కర్మాగారం, ఒక కార్మిక సంఘం మధ్య చాలా కాలంగా ఉన్న సమస్య వల్ల ఈ సంఘటన జరిగిందని పోలీస్ అధికారి సచిన్ నవాద్కర్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తతగానే ఉన్నప్పటికీ అదుపులోనే ఉందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా పోలీసులను మోహరించినట్లు చెప్పారు.