లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. తల్లి తనకు కొత్త బుల్లెట్ బైకు (Bullet bike), ఫోను కొనివ్వడంలేదన్న క్షణికావేశంలో 18 ఏండ్ల యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సుష్మా అనే మహిళ తన కుమారులు పీయూష్, పరాస్ తో కలిసి నోయిడాలోని ఓ అపార్ట్మెంట్లో జీవిస్తున్నది. పీయూష్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా, పరాస్ పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఇంటర్ ఫస్టియర్ వరకు చదివిన అతడు.. కాలికి పక్షవాతం కారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. కాగా, గత కొన్ని రోజులుగా తన తల్లిని బుల్లెట్ బైకు, మొబైల్ ఫోను కొనివ్వాలని అడుగుతున్నాడు. దీనికి ఆమె తిరస్కరిస్తూ వస్తున్నది. దీంతో మనస్థాపం చెందిన పరాస్.. తన గదిలో ఫాన్కు ఉరేసుకున్నాడు.
గుర్తించిన తల్లి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రూమ్ తలుపులు బద్దలు కొట్టారు. అయితే అప్పటికే పరాస్ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఏడాది క్రితం సైకిల్ కొనిపించనందుకు అలిగిన అతడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు.