శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కశ్మీర్ పండిట్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవడంతో వారు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో 177 మంది కశ్మీర్ పండిట్ టీచర్లకు సురక్షిత ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు. మే 12న సెంట్రల్ కశ్మీర్లోని బుద్గామ్ జిల్లా చదూరా ప్రాంతంలో ఉగ్రవాదుల కాల్పుల్లో రాహుల్ భట్ మరణించాడు. ఈ సంఘటన నాటి నుంచి కశ్మీరీ పండిట్ల నిరసనలు తీవ్రమయ్యాయి. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, లేని పక్షంలో మూకుమ్మడిగా ఉద్యోగాలకు రాజీనామా చేస్తామని, సెలవులు పెడతామని హెచ్చరిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జమ్ముకశ్మీర్లో భద్రతా పరిస్థితులపై శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కశ్మీరీ పండిట్ల భద్రతకు సంబంధించిన డిమాండ్లపై ప్రధానంగా చర్చించారు. ఈ నేపథ్యంలో 2012లో ప్రధాన మంత్రి ప్రత్యేక ప్యాకేజీ కింద ఉద్యోగంలో చేరిన 177 మంది కశ్మీరీ పండిట్ టీచర్లను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేశారు.
కాగా, మే 1 నుంచి పౌరులు, వలస వ్యక్తుల లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడుల సంఖ్య 9కి పెరిగింది. గురువారం జమ్ముకశ్మీర్లో వేర్వేరు చోట్ల ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక బ్యాంక్ మేనేజర్, ఇద్దరు వలస కూలీలు మరణించారు. దీనికి ముందు జమ్మూ ప్రాంతంలోని సాంబా జిల్లాకు చెందిన ఓ మహిళా టీచర్ను మంగళవారం దక్షిణ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలోని ఓ పాఠశాలలో ఉగ్రవాదులు కాల్చి చంపారు.
మే 18న ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా వద్ద ఉన్న వైన్షాప్లోకి ఉగ్రవాదులు చొరబడి గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనలో జమ్మూ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మే 24న శ్రీనగర్లో నివాసం వెలుపల పోలీస్ అయిన సైఫుల్లా ఖాద్రీని, అనంతరం రెండు రోజులకు టెలివిజన్ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ను బుద్గామ్లో ఉగ్రవాదులు కాల్చి చంపారు.