చండీగఢ్: ఇటలీ నుంచి వచ్చిన మరో విమానంలోని 173 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రోమ్ నుంచి 285 మంది ప్రయాణికులతో చార్టర్డ్ ఫ్లైట్ పంజాబ్లోని అమృత్సర్కు శుక్రవారం చేరింది. నిబంధనల ప్రకారం విమానాశ్రయంలో ఆ ప్రయాణికులకు కరోనా టెస్ట్ చేశారు. దీంతో 173 మందికి కరోనా పాజిటివ్గా తేలిందని అమృత్సర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ వీకే సేథ్ తెలిపారు. కరోనా పరీక్షలు ఇంకా కొనసాగుతున్నందున పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశమున్నదని అన్నారు. కరోనా సోకిన వారిని నగరంలోని పలు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డులకు తరలిస్తామని చెప్పారు.
కాగా, గురువారం కూడా ఇటలీలోని మిలాన్ నుంచి 179 మంది ప్రయాణికులతో అమృత్సర్ వచ్చిన చార్టర్డ్ విమానంలో 125 మందికి కరోనా పాజిటివ్గా టెస్ట్లో నిర్ధారణ అయ్యింది. ఇటలీని ‘రిస్క్’ దేశాల జాబితాలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేర్చింది. ఈ నేపథ్యంలో సంబంధిత నిబంధనల ప్రకారం అధికారులు కరోనా టెస్ట్లు నిర్వహిస్తున్నారు.
మరోవైపు, పోర్చుగీస్ విమానయాన సంస్థ ‘యూరో అట్లాంటిక్’ విమానాల్లో ఈ ప్రయాణికులు ఇటలీ నుంచి అమృత్సర్కు చేరుకున్నారు. అయితే ఎయిర్ ఇండియా విమానంగా కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన తప్పుడు వార్తలను ఆ సంస్థ ఖండించింది. ఇవి నిరాధార, తప్పుడు వార్తలని ట్విట్టర్లో పేర్కొంది. ప్రస్తుతం రోమ్ నుంచి ఎలాంటి విమాన సర్వీసులను నడపడం లేదని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.