న్యూఢిల్లీ: ఢిల్లీలోని విలాసవంతమైన వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉన్న ఓ ఆశ్రమం(Delhi Ashram)లోని స్వామీజీపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దాదాపు డజన్ మంది కన్నా ఎక్కువ మంది మహిళలు ఆ స్వామీజీపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెప్పారు. శ్రీ శారద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్లో పనిచేస్తున్న స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారధి అనే స్వామీజీపై కేసు నమోదు చేశారు. బలహీనవర్గాల కేటగిరీలో పీజీ మేనేజ్మెంట్ డిప్లామా కోర్సులు చదువుతున్న విద్యార్థినులు ఆ ఫిర్యాదు చేశారు.
ఆ ఆశ్రమంలోని 32 మంది విద్యార్థినులను పోలీసులు విచారించారు. దీంట్లో సుమారు 17 మంది అమ్మాయిలు స్వామీ చైతన్యానందపై ఆరోపణలు చేశారు. ద్వేషపూరిత భాషను వాడుతున్నారని, శృంగారభరిత టెక్ట్స్ మెసేజ్లు చేస్తున్నారని, భౌతికంగా తాకేందుకు ప్రయత్నిస్తున్నారని మహిళలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. డైరెక్టర్కు లొంగిపోవాలని ఆ ఆశ్రమంలోని మహిళా సిబ్బంది, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది కూడా వత్తిడి చేస్తున్నట్లు విద్యార్థినులు ఆరోపించారు.
ఆశ్రమంలో పనిచేస్తున్న వార్డెన్లు.. నిందితుడికి తమను పరిచయం చేసినట్లు విద్యార్థినులు పేర్కొన్నారు. స్టూడెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్వామీ చైతన్యానందపై లైంగిక వేధింపుల కేసు బుక్ చేసినట్లు డీసీపీ అమిత్ గోయల్ తెలిపారు. పోలీసులు సీసీటీవీ ఫూటేజ్ను పరిశీలించారు. నిందితుడి అడ్రస్లో తనిఖీలు చేశారు. ఆ స్వామీజీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆగ్రా వద్ద ఆయన ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడ గాలింపు చేపట్టారు.
దర్యాప్తు సమయంలో ఇన్స్టిట్యూట్ బేస్మింట్లో ఉన్న వోల్వో కారును పోలీసులు స్వాధీనం చేస్తుకున్నారు. ఆ వాహనాన్ని స్వామీ చైతన్యానంద వాడినట్లు గుర్తించారు. అయితే ఆ కారుకు నకిలీ డిప్లమాటిక్ నెంబర్ ప్లేట్(39 యూఎన్ 1) ఉన్నట్లు తేల్చారు. ఆ కారును ప్రస్తుతం సీజ్ చేశారు. నిందారోపణలు రావడంతో.. ఆశ్రమ అడ్మినిస్ట్రేషన్ ఆ స్వామీజీని తొలగించింది.
శృంగేరిలోని దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం.. ఢిల్లీలో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నది. ప్రస్తుత ఘటన నేపథ్యంలో ఆ పీఠం ఓ ప్రకటన జారీ చేసింది. స్వామీ చైతన్యానంద ప్రవర్తన, కార్యకలాపాలు అక్రమంగా,అసహజంగా, పీఠానికి వ్యతిరేకంగా ఉన్నట్లు పేర్కొన్నది. నిందిత స్వామీజీతో అన్ని సంబంధాలను తెంచుకున్నట్లు ఆ పీఠం పేర్కొన్నది. ఢిల్లీ పీఠానికి చెందిన యూనిట్లో రెండు బ్యాచ్లు ఉన్నాయి. ఒక్కొక్క బ్యాచ్లో 35 స్టూడెంట్స్ ఉంటారు.