మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. మానసికంగా ప్రశాంతత లేకుంటే జీవితమే అతలాకుతలం అవుతుంది. తీవ్రమైన ఆలోచనలతో ఒత్తిళ్లకు లోనై కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు. భారతీయుల్లో ఈ సమస్య దాదాపు 15 కోట్ల మందిలో ఉన్నదట. అవగాహనలేమి, ఇతరులు ఏమనుకుంటారోనన్న మీమాంసతో తగిన కౌన్సెలింగ్, చికిత్సకు తీసుకోకుండా తమలో తాము నలిగిపోతున్నారు. ఈ మానసిక అనారోగ్య సమస్యను పరిష్కరించడంలో భారత ప్రభుత్వం విఫలమైందని వైద్య నిపుణులు తెలిపారు. దేశంలో సరిపడా సైకియాట్రిస్టులు లేరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 30: దేశంలో దాదాపు 15 కోట్ల మంది భారతీయులు మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్(ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) సర్వే వెల్లడించింది. వీరిలో 30 లక్షల మంది మాత్రమే మానసిక ఆరోగ్య సంరక్షణ కోరుతున్నారని, మిగతావాళ్లు మెంటల్ హెల్త్పై అవగాహనలేమితో పాటు ఇతరులు ఏమనుకుంటారోనన్న భావనతో అలాగే ఒత్తిళ్లలోనే ఉండిపోతున్నారని తెలిపింది. న్యూరోసిస్, ఒత్తిడి రుగ్మతలను కూడా సర్వే పరిశీలించింది. తాము తీసుకొన్న శాంపిల్ సైజ్లో 1 శాతం మంది ఆత్మహత్య రిస్క్లో ఉన్నారని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. మానసిక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమని, దీనికి చికిత్స తీసుకోవడం అవసరమని ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్ డైరెక్టర్ ప్రతిమ మూర్తి స్పష్టం చేశారు.
సైకియాట్రిస్టుల కొరత
భారత్లో చాలా మంది యువకులు, చిన్నారులు మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, అయితే చికిత్స తీసుకొనే విషయంలో మౌనాన్ని వీడాలని యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి అర్జన్ డీ వాగ్ట్ అభిప్రాయపడ్డారు. అయితే భారత్లో ప్రజలకు చికిత్స అందించేందుకు సరిపడా మానసిక ఆరోగ్య సంరక్షకులు కూడా లేకపోవడం ఆందోళనకరం. ప్రతి లక్ష మంది రోగులకు కేవలం 0.75 సైకియాట్రిస్టులు ఉన్నారని, కానీ, లక్ష మందికి ముగ్గురు ఉండాల్సిన అవసరం ఉన్నదని ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ గతంలో పేర్కొన్నది.
బడ్జెట్ కేటాయింపులో కేంద్రం నిర్లక్ష్యం
ఓవైపు మానసిక ఆరోగ్య సమస్య పెరుగుతున్నదని చెప్పేందుకు డాటా ఉన్నప్పటికీ, కేంద్ర ఆరోగ్యశాఖ మానసిక ఆనారోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు 2022-23 బడ్జెట్లో ఒక్క శాతం కంటే తక్కువగా కేటాయించింది. మానసిక ఆరోగ్యం విషయంలో భారత్ వికేంద్రీకృత విధానం అవసరం అని సూసైడ్ ప్రివెన్షన్ ఇండియా ఫౌండేషన్కు చెందిన నెల్సన్ వినోద్ పేర్కొన్నారు. ‘క్లినిక్లు, దవాఖానలు ప్రారంభించేందుకు గ్రాంట్లు, రాయితీలతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆవిష్కరణలు, పరిశోధనలు, పబ్లిక్ హెల్త్ క్యాంపెయిన్లు అవసరం’ అని పేర్కొన్నారు. మానసిక ఆరోగ్య చికిత్సను జాతీయ ప్రాధాన్యంగా మార్చేందుకు ప్రభుత్వం తగిన విధానాలు రూపొందించాలని ఢిల్లీకి చెందిన సైకియాట్రిస్టు అంజలి నాగ్పాల్ అభిప్రాయపడ్డారు.
ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మానసిక అనారోగ్య సమస్యలతో పెరుగుదల కనిపించగా, భారత్లో ఈ సమస్య వైట్కాలర్ ఉద్యోగస్తుల్లో ఎక్కువగా ఉన్నదని డెలాయిట్ సర్వే పేర్కొన్నది. పని ప్రదేశంలో ఒత్తిళ్లు, ఆ తర్వాత ఆర్థిక సవాళ్లు తమ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని సర్వేలో పాల్గొన్న 47 శాతం మంది ప్రొఫెషనల్స్ తెలిపారు. గైర్హాజరు, తక్కువ ఉత్పాదకత, తదితర కారణాల వలన భారతీయ కంపెనీలు ఏడాదికి 14 బిలియన్ డాలర్లు కోల్పోతున్నాయని సర్వే పేర్కొన్నది. అదేవిధంగా మానసిక అనారోగ్య సమస్యలతో ఉత్పాదకత తగ్గిపోవడం వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏడాదికి 1 ట్రిలియన్ డాలర్లు నష్టం జరుగుతున్నదని డబ్ల్యూహెచ్వో అంచనా వేసింది.