న్యూఢిల్లీ, జూలై 23: నీట్ పీజీ-2021లో భాగంగా ఇప్పటి వరకు ఐదుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ 1,456 సీట్లు మిగిలిపోయాయని కేంద్రం వెల్లడించింది. సీట్ల భర్తీకి ఆరోగ్య శాఖ పరిధిలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఒక ప్రత్యేక రౌండ్తో సహా ఐదుసార్లు కౌన్సెలింగ్ చేపట్టిందని ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు.
లోక్సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్న కు మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఎంబీబీఎస్ చదివేందుకు విదేశాలకు వెళ్లే విద్యార్థుల సమాచారాన్ని పొందుపరిచే వ్యవస్థ లేదని కేంద్రం పేర్కొన్నది. విదేశాల్లో మెడిసిన్ అభ్యసించే విద్యార్థులను భారత్కు చెందిన మెడికల్ కాలేజీ లేదా యూనివర్సిటీలకు బదిలీ చేయడం గానీ, అడ్మిషన్లు ఇవ్వడం జరుగలేదని వెల్లడించింది. మరోవైపు కేంద్ర ఆరోగ్యశాఖ సెప్టెంబర్ 1 నుంచి నీట్ పీజీ-2022 కౌన్సెలింగ్ ప్రారంభించే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాలు శనివారం వెల్లడించాయి. రెండు నెలల పాటు జరిగే కౌన్సింగ్ ప్రక్రియ షెడ్యూల్ త్వరలో విడుదలవుతుందని తెలిపాయి.