న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా వారం రోజులు వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం కొత్తగా 1,367 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మంగళవారం (1,204) కంటే వైరస్ కేసులు 13 శాతం మేర పెరిగాయి. దీంతో పాజిటివిటీ రేటు 4.5 శాతంగా ఉన్నది. ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,78,458కి పెరిగింది. గత 24 గంటల్లో వైరస్ సోకిన వారిలో ఒకరు మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 26,170కి చేరినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం కూడా 1,204 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా వల్ల ఒకరు మరణించినట్లు చెప్పారు.
కాగా, ఒమిక్రాన్ కొత్త వేరియంట్ మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తున్నది. దీంతో దేశంలో కూడా కరోనా కేసుల నమోదు పెరుగుతున్నది. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులతోపాటు పాజిటివిటీ రేటు పెరుగుతున్నది. దీంతో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి రూ.500 జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు.