Dog Missing | జంతు ప్రేమికులకు పెంపుడు జంతువుల పట్ల చాలా అటాచ్మెంట్ ఉంటుంది. అవి ఒక్కక్షణం కనిపించకుండా పోతే విలవిల్లాడిపోతారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. 13 ఏళ్లుగా ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క తప్పిపోవడంతో యజమాని కన్నీరు పెట్టుకుంది.
ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో నివాసం ఉండే అనుప్రియా దాల్మియ.. గత 13 ఏళ్లుగా ఓ కుక్కను పెంచుకుంటోంది. దాన్ని ప్రేమగా చమేలీ అని పిలుచుకునేది. అయితే, అక్టోబర్ 14న రాత్రి దీపావళి సందర్భంగా ఆ ప్రాంతంలో బాణాసంచా కాల్చారు. బాణాసంచా పేలుడు శబ్ధాలకు భయపడిపోయిన చమేలీ ఇంటి నుంచి ఎక్కడికో పారిపోయింది. అప్పటి నుంచి దాని కోసం అనుప్రియా వెతకని చోటంటూ లేదు. అయినా కుక్కజాడ కనిపించకపోవడంతో తీవ్ర నిరాశ చెందింది. దీంతో కుక్కను కనుగొని తనకు అప్పగించిన వారికి అనుప్రియా భారీ రివార్డు ప్రకటించింది. చమేలీ ఆచూకీ తెలిపిన వారికి రూ.25,000వేలు బహుమతిగా అందజేస్తానని ప్రకటించింది.
‘13 ఏళ్లుగా చమేలీ ఎంతో సురక్షిత జీవితాన్ని గడిపింది. తనను తాను ఎలా రక్షించుకోవాలో కూడా తెలియదు. చమేలీ కనిపించకపోవడంతో చాలా కలతచెందాము. చమేలీ ఆచూకీ కనుగొనేందుకు నాకు సాయం కావాలి. ఢిల్లీ పరిసరాల్లో ఎక్కడైనా కనిపిస్తే +919891027274 ఈ నంబర్కు సమాచారం ఇవ్వగలరు. చమేలీ ఆచూకీ తెలిపిన వారికి రూ.25,000వేలు బహుమతిగా అందజేస్తా’ అని అనుప్రియా దాల్మియా తెలిపింది. దీంతోపాటు కుక్క ఫొటోలను సైతం సోషల్ మీడియాలో పోస్టు చేసింది.