Assasm : అస్సాలోని జొర్హాట్ జిల్లాలో సోమవారం చిరుతపులి బీభత్సం సృష్టించింది. అటవీ ప్రాంతంలోని ఇనుప కంచె దాటి జనావాసాల్లోకి వచ్చిన చిరుత పలువురిపై దాడి చేసింది. ఈ సంఘటనలో 13మంది గాయపడ్డారని, వీళ్లలో ముగ్గురు అటవీ శాఖ ఉద్యోగులు ఉన్నారని జొర్హాట్ ఎస్పీ మోహన్ లాల్ మీనా తెలిపారు. గాయపడ్డ వాళ్లను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వాళ్ల పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్పారు. చిరుత దాడికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఇనుప కంచెను దాటి వచ్చిన చిరుత ఒక వాహనంలో ఉన్నవాళ్ల మీద దాడి చేసేందుకు ప్రయత్నించిందని అటవీ అధికారులు తెలిపారు.
రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐసీఎఫ్ఆర్ఈ) ఉన్న చెనిజాన్ పరిధిలోని అటవీ ప్రాంతం నుంచి ఆ చిరుత బయటకు వచ్చినట్టు తెలిసింది. దాంతో, ఆ చిరుతను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.