కొత్తగూడెం క్రైం, మే 10: ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవులు మరోసారి రక్తమోడాయి. బీజాపూర్ జిల్లా గంగలూరు దండకారణ్యంలో శుక్రవారం భద్రతా బలగాల ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులు రహస్యంగా సమావేశమవుతున్నారని, ఆ పార్టీ అగ్రనేత ఒకరు హాజరవుతున్నారనే సమాచారంతో బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. నక్సలైట్లు ఐఈడీ పేల్చడంతో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. గత నెల వ్యవధిలో జరిగిన మూడవ పెద్ద ఎన్కౌంటర్ ఇది. గత నెల 16న కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. 30న జరిగిన నారాయణ్పూర్-కాంకేర్ జిల్లా సరిహద్దులో జరిగిన మరో ఎన్కౌంటర్లో 10 మంది మరణించారు.
తాజా ఘటనతో ఈ ఏడాది ఇప్పటి వరకు ఛత్తీస్ఢ్లోని బస్తర్ రీజియన్లో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో మరణించిన నక్సలైట్ల సంఖ్య 103కు చేరింది. తాజా ఎన్కౌంటర్కు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. గంగలూరు పోలీస్స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులు ప్లీనరీ నిర్వహించేందుకు సమావేశమవుతున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దంతెవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాల నుంచి జిల్లా రిజర్వు గార్డ్స్(డీఆర్జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా, సీఆర్పీఎఫ్ విభాగాల నుంచి 1,200 మంది బలగాలు గంగలూరు పరిధిలోని అడవులను జల్లెడ పట్టారు. ఈ క్రమంలో పీడియా అడవుల్లో తారసపడిన మావోయిస్టులు బలగాలపై కాల్పులకు దిగారు. అప్పటికే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన కాల్పుల తర్వాత ఘటనాస్థలిలో 12 మంది మావోయిస్టుల మృతదేహాలతోపాటు భారీగా ఆయుధ, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. మావోయిస్టుల సమావేశానికి హార్డ్కోర్ నక్సల్ కమాండర్లు లింగా, పాపారావుతోపాటు మరికొందరు కీలక నేతలు సైతం హాజరైనట్టు తెలుస్తున్నది. డీకేఎస్జెడ్సీ, డీవీసీఎం, ఏసీఎం క్యాడర్ మావోయిస్టులు పాల్గొన్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.