Goa : హాలిడే స్పాట్ అయిన గోవాకు వచ్చే టూరిస్ట్ల దగ్గర ఫోన్లు కొట్టేస్తున్నవాళ్లను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. రెండు ముఠాలకు చెందిన 12మందిని అదుపులోకి తీసుకున్నారు. బగ, కలంగూట్ ప్రాంతాల్లో పర్యాటకుల ఫోన్లు దొంగిలిస్తున్న వీళ్లను మాటు వేసి మరీ పట్టుకున్నారు. ‘గోవాలో జరుగుతున్న సన్బర్న్ ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (ఈడీఎం) ఫెస్టివల్, కొత్త సంవత్సరం వేడుకలకు వచ్చే పర్యాటకుల దగ్గర ఫోన్లు దొంగిలించేందుకు ఈ రెండు గ్యాంగుల సభ్యులు వచ్చారు’ అని నార్త్ గోవా ఎస్పీ నిధిన్ వల్సన్ తెలిపారు. వీళ్ల నుంచి రూ.30 లక్షల నగదుతో పాటు 41 బ్రాండెడ్ ఫోన్లు, రెండు టయోటా కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్లపై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41 కింద కేసు నమోదు చేశారు.
పూణేకు చెందిన జితేశ్ మెహతా అనే పర్యాటకుడు తన జేబులోంచి ఫోన్ను ఎవరో దొంగిలించారని కలంగూట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాంతో దొంగను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అతడిని విచారించగా .. తాము 12 మంది ఉన్నామని, రెండు ముఠాలకు తాము ఫోన్లు దొంగతనం చేయడానికి మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చామని చెప్పాడు. దాంతో పోలీసులు మిగతా 11 మందిని కూడా అరెస్ట్ చేశారు. ఈ ముఠా సభ్యులు దేశవ్యాప్తంగా జనం ఎక్కువ ఉండే ప్రదేశాల్లో ఫోన్లు దొంగిలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
గోవాకు నిత్యం వేలాది మంది పర్యాటకులు వెళ్తుంటారు. స్పెషల్ ఫెస్టివల్స్, కొత్త సంవత్సరం వేడుకల కోసం దేశ నలుమూలల నుంచి టూరిస్ట్లు వెళ్తారు. ఇదే అదనుగా కొందరు వాళ్ల ఫోన్లు దొంగిలిస్తుంటారు. అయితే.. ఈసారి ముందుగానే ఫోన్ దొంగలను పోలీసులు పట్టుకోవడంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకుంటున్నారు.