న్యూఢిల్లీ : ఓ వైపు కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంటే.. మరో వైపు వ్యాక్సిన్ల కొరత దేశాన్ని వెంటాడుతోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉండటంతో.. మొదటి డోసు, రెండో డోసు మధ్య గడువును పెంచేందుకు నిపుణులు పరిశీలిస్తున్నారు. అయితే కొవిషీల్డ్ రెండో డోసు వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచొచ్చని ప్రభుత్వ ప్యానెల్ సిఫార్సు చేసింది.
కొవిషీల్డ్ టీకాల కోసం డిమాండ్ పెరగడం, సీరం సంస్థ డిమాండ్కు అనుగుణంగా తక్కువ సమయంలో ఉత్పత్తి చేయకపోవడంతో.. మొదటి, రెండో డోసుల మధ్య గడువును పెంచేందుకు ప్రభుత్వ ప్యానెల్ సిఫారసు చేసింది. అయితే దీని వల్ల ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు అని తెలిపింది.
కొవిషీల్డ్ వ్యాక్సిన్ తొలిసారి వచ్చినప్పుడు రెండో డోసును 4 నుంచి 6 వారాల మధ్య తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత గత ఏప్రిల్లో ఇది 6-8 వారాల మధ్య అయితే వ్యాక్సిన్ మరింత మెరుగ్గా పని చేస్తుందంటూ కేంద్రం ప్రకటించింది.
గత మార్చి నెలలో లాన్సెట్లో ఓ అధ్యయనాన్ని ప్రచురించారు. దాని ప్రకారం కొవిషీల్డ్ వ్యాక్సిన్ను 12 వారాల తర్వాత తీసుకుంటే సామర్థ్యం 81.3 శాతంగా ఉన్నట్లు గుర్తించారు. అదే ఆరు వారాలలోపు తీసుకుంటే మాత్రం సామర్థ్యం 55.1 శాతంగా మాత్రమే ఉందని పరిశోధకులు వెల్లడించారు.
ఇక బ్రిటన్, బ్రెజిల్లలో జరిగిన చివరి దశ ట్రయల్స్లో వ్యాక్సిన్ సామర్థ్యం 90 శాతం దాకా ఉంటున్నట్లు తేలింది. అయితే అది జరగాలంటే ముందు సగం డోసు ఇచ్చి నెల తర్వాత మొత్తం డోసు ఇవ్వాల్సి ఉంటుందని ఈ ట్రయల్స్ తేల్చాయి. ఇక ఇప్పటికే యూకే, కెనడాలాంటి దేశాలు 12 వారాలు, 16 వారాల తర్వాత రెండో డోసు ఇస్తున్నాయి. రెండో డోసుల మధ్య ఎక్కువ సమయం ఉంటే మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇండియాలోనూ ఇదే అమలు చేస్తే వ్యాక్సిన్ల కొరతను కాస్తయినా అధిగమించే వీలుంటుంది. రెండో డోసు తీసుకునే వాళ్లు మరికొంత ఎక్కువ కాలం వేచి ఉండాల్సి రావడంతో ఆ మేరకు మరికొంత మందికి తొలి డోసు వేసే అవకాశం దక్కుతుంది. ఇలా వ్యాక్సిన్ల కొరతకు కాస్త చెక్ పెట్టవచ్చు. ఎక్కువ గ్యాప్ తర్వాత రెండో డోసు తీసుకుంటే ఎక్కువ రక్షణ ఉండటంతోపాటు ఆ లోపు కనీసం ఒక్క డోసు తీసుకున్న వారు కాస్తయినా సురక్షితంగా ఉంటారు. ఇలా రెండు రకాలుగా ఇది ఉపయోగపడనుంది.