న్యూఢిల్లీ : భూ వివాదం కేసులో న్యాయం కోసం ఓ 108 ఏండ్ల వ్యక్తి 53 సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరిగారు. తీరా పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించే సమయానికి ఆయన మరణించారు. 2015 అక్టోబర్ 23, 2019 ఫిబ్రవరి 13 నాటి హైకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేయడంలో 1,467 రోజులు, 267 రోజుల ఆలస్యాన్ని ఖండిస్తూ దరఖాస్తులపై జస్టిస్ డీవై చంద్రచూడ్, హృషికేశ్ రాయ్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఎనిమిది వారాల్లోగా ప్రతివాదులు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించిన వార్తను వినేందుకు పిటిషనర్ సజీవంగా లేరని ఆయన తరపు న్యాయవాది విరాజ్ కదమ్ తెలిపారు. ఇప్పుడు ఈ కేసును వాదించేందుకు అతడి చట్టపరమైన వారసులు సిద్ధమయ్యారు.
పిటిషనర్ గ్రామీణ ప్రాంతానికి చెందినవాడని, 2015 లో కేసు కొట్టివేసిన తర్వాత న్యాయవాదిని సంప్రదించలేకపోవచ్చునని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషనర్ తరపున విరాజ్ కదమ్ అందించిన సమాచారాన్ని కోర్టు గుర్తించి, నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నది. దిగువ కోర్టు తీర్పును మొదటి అప్పీలేట్ కోర్టు తిప్పికొట్టింది. రెండవ అప్పీల్ 1988 నుంచి బొంబాయి హైకోర్టులో పెండింగ్లో ఉన్నది. రెండవ అప్పీల్ను 2015 ఆగస్టు 19 న వాయిదా వేశారు. దీని తర్వాత 2015 ఆగస్టు 22 న ఇరుపార్టీల న్యాయవాదులు హైకోర్టు ముందు హాజరై ఆదేశాలు పొందేందుకు ఈ విచారణను వాయిదా వేయాలని అభ్యర్థించారు. రెండవ అప్పీల్ 2015 సెప్టెంబర్ 3 న వాయిదా పడింది. ఆ తర్వాత ఈ అప్పీల్ను 2015 అక్టోబర్ 23 న కొట్టివేసింది.
అప్పీల్ పునరుద్ధరణ కోసం పిటిషనర్ దరఖాస్తు చేశారా? అని ధర్మాసనం ప్రశ్నించగా.. రెండవ అప్పీల్ పునరుద్ధరణకు దరఖాస్తు చేయడంలో ఆలస్యమైందని, అందుకు క్షమించమని తాను దరఖాస్తు చేశానని, అయితే అది కూడా 2019 ఫిబ్రవరి 13 న కొట్టివేసినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది విరాజ్ కదమ్ తెలిపారు. చివరకు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఎనిమిది వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ వార్త వినకుండానే సదరు పిటిషనర్ కన్నుమూయడం విచారకరం.
గైక్వాడ్ అనే వ్యక్తి 1968 లో రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ కింద భూమిని కొనుగోలు చేసాడు. అసలు యజమాని భూమిని కుదువ పెట్టి బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. అసలు యజమాని రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఆస్తిని అటాచ్ చేయమని బ్యాంక్ అధికారులు గైక్వాడ్కు నోటీసులు జారీ చేశారు. దాంతో భూమి అసలు యజమాని, బ్యాంకుకు వ్యతిరేకంగా గైక్వాడ్ దిగువ కోర్టును ఆశ్రయించాడు. గైక్వాడ్ వాదనను అంగీకరించిన కోర్టు.. 1982 సెప్టెంబర్ 10 న అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై అసలు యజమాని మొదటి అప్పీల్ దాఖలు చేయగా.. 1987 లో తీర్పు తారుమారైంది. దీనిపై గైక్వాడ్ 1988 లో హైకోర్టులో రెండవ అప్పీల్ దాఖలు చేయగా, 2015 లో కొట్టివేసింది. దాంతో తనకు న్యాయం జరిగేంత వరకు పోరాడతానని గైక్వాడ్ నిశ్చియంచుకుని గత 53 ఏండ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. ఎట్టకేలకు సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే, అంతకుముందే గైక్వాడ్ తుదిశ్వాస విడిచారు.
ఢిల్లీలో రైతు పార్లమెంట్.. షరతులతో అనుమతి
చరిత్రలో ఈరోజు.. మువ్వన్నెల జెండాకు ఆమోదం
రహస్య చట్టంలో మార్పులకు బ్రిటన్ సన్నాహాలు
రాజ్కుంద్రా ‘క్యూ’ చెప్పింది ఇక్కడే..?
ఇంట్లో ఫోన్ మర్చిపోయారా..? డోంట్వర్రీ కారు ఉందిగా..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..