పటియాలా: ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కేక్ (Cake) తిని పదేండ్ల చిన్నారి మృతిచెందింది. గత ఆదివారం పంజాబ్లోని పటియాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పటియాలాకు చెందిన 10 ఏండ్ల చిన్నారి మాన్వికి ఈ నెల 24న పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని ఓ బేకరీ నుంచి ఆన్లైన్లో కేక్ ఆర్డర్ చేశారు. సాయంత్రం 7 గంటలకు కేక్ కట్ చేసి.. కుటుంబ సభ్యులంతా తిన్నారు. రాత్రి 10 గంటలకల్లా అందరూ అస్వస్థతకు గురయ్యారు.
గొంతు తడారిపోతోందంటూ మాన్వి మంచినీళ్లు తాగి నిద్రలోకి జారుకుంది. ఉదయానికి కల్లా ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించారు. అయితే వైద్యులు ప్రయత్నించినప్పటికీ ఆ చిన్నారిని కాపాడలేకపోయారు. కేకు విషపూరితం కావడం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బేకరీ యజమానిపై పోలీసులు కేసు నమోదుచేశారు.