కోల్కతా: ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఒకే రోజు పది మంది నవజాత శిశువులు మరణించారు. దీంతో కలకలం చెలరేగింది. అయితే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ఆ నవజాత శిశువులను పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు వైద్యాధికారి తెలిపారు. (newborns die) పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మాల్దా మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఒకే రోజు పది మంది నవజాత శిశువులు చనిపోయారు. ఆగస్ట్ రెండో వారంలో ఈ సంఘటన జరిగింది. దీంతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ సమగ్ర నివేదిక కోరింది.
కాగా, మరణించిన 10 మంది శిశువులలో ఎనిమిది మంది ఇతర ప్రభుత్వ ఆసుపత్రులు లేదా ప్రైవేట్ నర్సింగ్ హోమ్లలో జన్మించినట్లు మెడికల్ సూపరింటెండెంట్ ప్రసేన్జిత్ బార్ తెలిపారు. తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్న ఆ నవజాత శిశువులను మాల్దా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు చెప్పారు.
శ్వాసకోశ ఇబ్బందులు, పచ్చకామెర్లు, గుండె సంబంధిత సమస్యల కారణాలతో ఆ శిశువులు మరణించినట్లు వివరించారు.
అయితే మరణించిన పది మంది నవజాత శిశువుల్లో ఇద్దరు మాత్రమే ఈ ఆసుపత్రిలో జన్మించారని, మిగతా వారిని తీవ్ర పరిస్థితుల్లో బయట ఆసుపత్రుల నుంచి మాల్దా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు మెడికల్ సూపరింటెండెంట్ ప్రసేన్జిత్ బార్ తెలిపారు. ఇప్పటికే ఆరోగ్య శాఖకు ప్రాథమిక నివేదిక సమర్పించినట్లు చెప్పారు. దీనిపై సమగ్ర నివేదికను త్వరలోనే పంపిస్తామని ఆయన అన్నారు.