విదిషా : విద్యార్థులను మత మార్పిడి చేశారని ఆరోపిస్తూ బజరంగ్ దళ్ కార్యకర్తలు వందలాది మంది స్థానికులతో కలిసి మధ్యప్రదేశ్లోని క్రైస్తవ మిషనరీ సంస్థపై దాడి చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకున్నది. 12వ తరగతి విద్యార్థులకు గణిత పరీక్షకు హాజరైన సమయంలో ఈ హింసాత్మక ఘటన చోటు చేసుకున్నది. విదిషా జిల్లా గంజ్ బసోడా పట్టణంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఎనిమిది విద్యార్థులను నిర్వాహకులు మతం మార్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు రాగా.. పాఠశాలపై దాడి ఘటన చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టారు. దాడి నుంచి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తృటిలో తప్పించుకున్నారు.
రాళ్ల దాడితో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. పాఠశాల మేనేజర్ బ్రదర్ ఆంటోనీ స్థానిక మీడియా ద్వారా దాడి గురించి ఒక రోజు ముందుగానే తనకు సమాచారం అందిందని, ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించామని, అయితే పోలీసులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. మత మార్పిడి వార్తలను ఖండించారు. స్థానిక బజరంగ్దళ్ నేత నీలేశ్ అగర్వాల్ ఆరోపించిన మత మార్పిడిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే, విధ్వంసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసు తెలిపారు. మతమార్పిడి సైతం విచారణ ప్రారంభిచినట్లు పేర్కొన్నారు.