న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సొంతంగా యూట్యూబ్ టీవీని ప్రారంభించింది. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ‘ఐఎన్సీ టీవీ’ ఛానల్ను బుధవారం లాంచ్ చేసింది. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ ఖర్గే, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు నీరజ్ కుందన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మితా దేవ్ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తొలి షోగా భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో జర్నలిస్టుగా మహాత్మా గాంధీ పాత్రపై ఒక లఘు చిత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రసారం చేసింది.
ఈ నెల 24న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని లైవ్ కార్యక్రమాలను ప్రసారం చేస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు. ప్రతి రోజు సుమారు 8 గంటలపాటు ప్రత్యక్ష కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. చాలా ఏండ్లుగా ప్రధాన స్రవంతి మీడియా పక్షపాతంతో, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో తమ సందేశాన్ని ప్రజలకు నేరుగా తెలియజేయడానికి సొంతంగా పార్టీ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించినట్లు పేర్కొంది.
మరోవైపు కేంద్రంలోని అధికార బీజేపీ యూట్యూబ్ ఛానల్ను 3.67 కోట్ల మంది అనుసరిస్తున్నారు.