అహ్మదాబాద్: వృద్ధిలోకి రావాలంటే చదువు ఒక్కటే ప్రధానం కాదు. వినూత్న ఆలోచన, పట్టుదల ఉంటే ఎవరైనా ఐశ్వర్యవంతులు కావొచ్చని నిరూపించాడు మధ్యప్రదేశ్కు చెందిన ప్రఫుల్ బిల్లోర్. ప్రతిష్ఠాత్మక ఐఐఎం విద్యాసంస్థల్లో ఎంబీఏ చేద్దామనుకున్న ప్రఫుల్.. మూడుసార్లు ప్రయత్నించినప్పటికీ క్యాట్ పరీక్షలో నెగ్గలేకపోయాడు. ఆర్థిక ఇబ్బందులు మొదలుకావడంతో మెక్డొనాల్డ్స్లో చేరాడు. ఉద్యోగం చేస్తూనే ఓ చిన్న టీ కొట్టు పెట్టుకున్నాడు. కస్టమర్ల నుంచి మంచి స్పందన రావడంతో దాన్ని పూర్తిస్థాయిలో నడుపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తాను ప్రవేశం పొందాలని కలలుగన్న ఐఐఎం-అహ్మదాబాద్ సంస్థ సమీపంలోని ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. చదువుకోసం అని చెప్పి తండ్రి నుంచి రూ. 10 వేలు తెచ్చుకొని ‘ఎంబీఏ చాయ్వాలా’ పేరిట టీ స్టాల్ తెరిచాడు. ఎంబీఏ విద్యార్థులు, స్టాఫ్తో ఇంగ్లిష్లో మాట్లాడుతూ కస్టమర్ బేస్ను క్రమంగా పెంచుకున్నాడు. ఇలా కొద్దికాలంలోనే దేశవ్యాప్తంగా 22 టీస్టాల్స్ను ప్రారంభించారు.