BJP | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఎన్నికలకు ముందు బోరు బావులకు ఉచిత కరెంటిస్తామని ప్రకటించిన యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదని రాష్ట్ర రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెల ముందు గొట్టపు బావుల విద్యుత్తు బిల్లులను 50 శాతం తగ్గిస్తూ యోగీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ వ్యవసాయ గొట్టపు బావులకు ఉచిత విద్యుత్ ఇస్తామంటూ బీజేపీ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో రైతులు దాదాపు 14 లక్షల బోరు బావులు కలిగి ఉన్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి బోరు బావులకు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తామని యూపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాలేదని రైతు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.
సీఎం యోగీ.. రైతులను మోసం చేశాడని భారతీయ కిసాన్ యూనియన్ ఆరోపించింది. 76 వేల మంది రైతులు సుమారు రూ.125 కోట్లు బకాయి పడ్డారని విద్యుత్ బోర్డు చెప్తున్నదని భారతీయ కిసాన్ సంఘ్ నేత ధర్మేంద్ర మాలిక్ ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో గొట్టపు బావుల ఉచిత విద్యుత్తు కోసం రూ.1500 కోట్లు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించినా ఆ ఫలితం రైతులకు చేరలేదన్నారు. రైతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రేమ లేదని భారతీయ కిసాన్ సంఘ్ మీరట్ అధ్యక్షుడు అనురాగ్ అన్నారు. ఒక వేళ బీజేపీ ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉంటే వ్యవసాయ బోరు బావులకు మీటర్లు ఎందుకు అమర్చుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ సారి రైతులు మరింత ఉధృతంగా ఆందోళన చేస్తారని, అందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.