కొండాపూర్/ శేరిలింగంపల్లి, జూన్ 8 : నియోజకవర్గవ్యాప్తంగా వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన చందానగర్ డివిజన్ పరిధిలోని రేగులకుంట చెరువు నుంచి గంగారం చెరువు వరకు దీప్తిశ్రీనగర్ మీదుగా రూ. 38 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న వరద నీటి కాలువ (స్ట్రామ్ వాటర్ డ్రైన్) పనులను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. గతంలో కొద్ది పాటి వర్షానికే దీప్తిశ్రీనగర్లో ముంపు సమస్యలు ఉండేవని, వాటి శాశ్వత పరిష్కారానికి పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. వరద నీటి కాలువతో పాటు నాలా విస్తరణ పనులు సైతం కొనసాగుతున్నాయన్నారు. పనుల్లో జాప్యం లేకుండా నాణ్యతతో వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. నాలాల పూడికతీత, విస్తరణతో పాటు వరద నీటి కాలువల నిర్మాణ పనులు నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్, జీహెచ్ఎంసీ ఈఈ శ్రీకాంతిని, డీఈ రూపాదేవి, వర్క్ఇన్స్పెక్టర్ జగదీశ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీనగర్ సీబీఆర్ ఎస్టేట్ సమీపంలో కొనసాగుతున్న నాలా విస్తరణ పనులను మంగళవారం ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అకాలవర్షాలతో గతంలో తలెత్తిన సమస్యలు పునారావృతం అవ్వకుండా పనుల్లో వేగాన్ని పెంచాల్సిందిగా కాంట్రాక్టర్లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతిని, డీఈ రూపాదేవి, వర్క్ ఇన్స్పెక్టర్ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
వరద సమస్య రాకుండా
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నలగండ్ల హుడా కాలనీలో వరద సమస్య తలెత్తకుండా రూ. 40 లక్షల వ్యయంతో చేపడుతున్న వరద నీటి కాలువ నిర్మాణ పనులను మంగళవారం ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పరిశీలించారు. హుడా కాలనీ నుంచి జీహెచ్ఎంసీ పార్కు వరకు చేపడుతున్న వరద నీటి కాలువతో కాలనీలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు డీఈ శ్రీనివాస్, ఏఈ కృష్ణవేణి, వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్, నాయకులు శ్రీనివాస్ యాదవ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.