యాదగిరిగుట్ట, మార్చి9 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 11 నుంచి మార్చి 21 వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 11న స్వస్తివాచనం, అంకురారోపణం, విశ్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. 17న ఎదుర్కోలు, 18న స్వామి వారి తిరుకల్యాణోత్సవం, 19న దివ్య విమాన రథోత్సవం, 20న మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, 21న శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో ఉత్సవాలను పరిపూర్ణం చేయనున్నారు. ఇందులో భాగంగా వారం రోజులపాటు అలంకార సేవలు నిర్వహించనున్నారు.
ఆలయం పునఃప్రారంభమైన తరువాత రెండోసారి జరిగే వార్షిక బ్రహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ముఖ మండపంలో రంగురంగుల విద్యుద్దీపాలతో తీర్చిదిద్దారు. రథశాలను సిద్ధం చేశారు. ఆలయ ప్రధాన రహదారుల్లో విద్యుద్దీపాలతో కూడిన స్వాగత తోరణాలు బిగించారు. ఈ సారి స్వామివారి కల్యాణోత్సవాన్ని కొండపైన ఉత్తరభాగం తిరుమాఢ వీధుల్లో జరిపించనున్నారు. స్వామివారి అలంకార సేవలను తిరుమాఢ వీధుల్లో ఊరేగించనున్నారు. ఈ ఉత్సవాల్లో 100 మంది పారాయణికులు, రుత్వికులు, ఆచార్యులు, పండితులు పాల్గొననున్నారు.
ప్రధానాలయ ఉత్తర ప్రాంతంలోని వాయుదిశలో నిర్మించిన లిఫ్ట్, రథశాల ప్రాంతంలో కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 18న రాత్రి 8 గంటలకు స్వామి, అమ్మవార్ల తిరు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 80 ఫీట్ల పొడవు, 45ఫీట్ల వెడల్పుతో ప్రత్యేక కల్యాణ మండపాన్ని సిద్ధం చేస్తున్నారు. కల్యాణ మండపం ఎదురుగా 10 వేల మంది భక్తులు కూర్చునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా అలంకార సేవలు 13న మత్స్యాలంకారంతో ప్రారంభమై 19న శ్రీమహావిష్ణు అలంకార సేవతో పరిపూర్ణమవుతాయి. మొదటి ప్రాకార మండపంలో స్వామివారి సేవలను అలంకరించనున్నారు. స్వామి సేవలను పశ్చిమ రాజగోపురం గుండా మాఢవీధుల్లో ఊరేగిస్తారు. కొండపైన విష్ణుపుష్కరిణిలో స్వామివారికి చక్రతీర్థ స్నానం నిర్వహించనున్నారు. చక్రతీర్థం అనంతరం స్వామివారికి వినియోగించిన శుద్ధ జలాలను ప్రచారం రథంతో ఊరేగింపుగా వెళ్లి కొండకింద లక్ష్మీ పుష్కరిణిలో కలుపుతారు.
యాదగిరిగుట్ట : యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యతో కలిసి దేవస్థాన అధికారులు శనివారం పలువురు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను అందజేశారు. హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శాంతి కుమారి, రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్తోపాటు వివిధ మంత్రులను వేర్వేరుగా కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశికధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈఓ రామకృష్ణారావు, ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, అర్చకులు మంగళగిరి నరసింహమూర్తి, అధ్యాపకులు నల్లన్థీఘళ్ సీతామనోహరాచార్యులు పాల్గొన్నారు.
యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 11 నుంచి 21 వరకు నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ రామకృష్ణ తెలిపారు. స్వామివారి రాత్రి నివేదన అర్చన అనంతరం 8.15 నుంచి 9.00 గంటల వరకు బలిహరణ, ఆరగింపు జరిపించనున్నారు. రాత్రి 7 గంటలకు అలంకార సేవలు, సర్వ దర్శనాలు ప్రారంభించనున్నారు. రాత్రి 10 గంటలకు శయనోత్సవ సేవ, ద్వార బంధనం. 17నుంచి 19వరకు భక్తులచే జరిపే అర్చనలు, బోగాలు, 20, 21 తేదీల్లో అభిషేకాలు, అర్చనలు రద్దు చేయనున్నట్లు ఈఓ చెప్పారు.