యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా, ఎలాంటి అవాంతరాలూ కలుగకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. మద్యం, డబ్బు, ఇతరత్రా తాయిలాలు రవాణా జరగకుండా నిరోధించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సరిహద్దుల్లో చెక్పోస్ట్లను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాలపైనా నజర్ పెట్టారు. జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు 2,141 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో భద్రత అత్యంత కీలకం కాగా, షెడ్యూల్ జారీ అయిన రోజునే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నోటిఫికేషన్కు ముందు, తర్వాత తీసుకోవాల్సి చర్యలపై ప్లాన్ రూపొందించారు. ప్రచార శైలి, అనుమతులు, రాజకీయ పార్టీలపై నిఘా పెట్టారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా సాంకేతికకు ప్రాధాన్యం ఇస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోకి ప్రవేశించే ప్రధాన మార్గాలపై పికెట్లు ఏర్పాటు చేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో 23 చెక్పోస్ట్లు, జిల్లా పరిధిలో తొమ్మిది చెక్ పోస్టుల ద్వారా పూర్తి నిఘా పెట్టారు. వాహనాలను నిశితంగా తనిఖీ చేస్తున్నారు. 50వేల రూపాయలకు మించి డబ్బులు కలిగిన వారి నుంచి నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. అనుమానస్పద స్థితిలో కనిపించిన వారిని ప్రశ్నిస్తున్నారు. మద్యం, డబ్బు అక్రమ రవాణా జరగకుండా పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 24గంటలపాటు తనిఖీలు చేయడానికి సిబ్బందిని షిఫ్ట్ల వారీగా నియమించారు. ఎన్నికల నేపథ్యంలో ముందస్తు అనుమతి తీసుకోకుండా సభలు, సమావేశాలు నిర్వహించొద్దని అధికారులు సూచించారు.
రూ. 50వేలకు మించితే సీజ్..
ఆధారాలు లేకుండా రూ.50వేలకు మించి డబ్బు తరలిస్తే సీజ్ చేస్తున్నారు. సాధారణ వ్యక్తులు, వ్యాపార నిమిత్తం, ఆస్పత్రి అవసరాలు, వివాహాల షాపింగ్ ఇతర ఖర్చులకు నగదు తీసుకెళ్లాల్సి వస్తే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలిపే పత్రాలు చూపాల్సి ఉటుంది. బ్యాంక్ నుంచి విత్ డ్రా చేసిన రశీదు, ఏటీఎం నుంచి ఉపసంహరించుకున్న స్లిప్లను అధికారులకు చూపించాల్సి ఉంటుంది. బంగారం తరలించినా దానికి సంబంధించి ఆధారాలు ఉండాలి. ఎలాంటి పత్రాలు, ఆధారాలూ లేకుంటే పోలీసులు సీజ్ చేసే అవకాశం ఉంది.
బైండోవర్లు.. ఆయుధాల స్వాధీనం
యాదాద్రి జోన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న సిబ్బంది సేవలకు వినియోగించుకుంటున్నారు. అదనంగా సాయుధ బలగాలు, కేంద్ర బలగాలను మోహరించారు. పోలీసులతోపాటు రెవెన్యూ, పంచాయతీ, రవాణా, ఆబ్కారీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో 23ఫ్లయింగ్ స్కాడ్లు, 23 స్టాటిస్టికల్ సర్వేయల్ టీమ్లు, 9 వీడియో వీవింగ్ టీమ్లు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాయి. జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలనూ గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా నజర్ పెట్టారు. ఎన్నికల కమిషన్ నియామవళిని అనుసరించి ఆయుధాల లైసెన్స్ కలిగిన ఉన్న వారి నుంచి తుపాకీలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. రౌడీషీటర్లను బైండోవర్ చేస్తున్నారు. పాత నేరస్తులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులపై నిఘా పెంచారు. ఏమైనా సమస్యలు ఉంటే 1950 నంబర్తోపాటు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
సోషల్ మీడియాపైనా ఫోకస్..
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్), యూట్యూబ్, వాట్సాప్.. ప్రస్తుత కాలంలో వీటి పేర్లు తెలియని వాళ్లు లేరు. కొంతమంది రెండు, మూడు అకౌంట్లు కూడా ఉపయోగిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు సోషల్ మీడియాతోనే కాలం గడుపుతున్నారు. సరిగ్గా రాజకీయ నాయకులు వీటిని క్యాష్ చేసుకుంటున్నారు. అభ్యర్థులంతా ప్రత్యేకంగా సామాజిక మాధ్యమ విభాగాలను ఏర్పాటు చేసుకున్నారు. వ్యక్తిగత, పార్టీ ప్రచారాలకు ఎలాంటి ఆంక్షల్లేనప్పటికీ ఇతర పార్టీలను తిట్టడం, దూషించడం, అసభ్యకరమైన, మత విశ్వాసాలు దెబ్బతినేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. అభ్యర్థులు కోడ్ నిబంధనలను అతిక్రమిస్తే అఫిడవిట్ను రద్దు చేయడంతోపాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.