యాదాద్రి, డిసెంబర్ 25 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం ఆదివారం భక్తజనసంద్రంగా మారింది. వరుస సెలవుల నేపథ్యంలో స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం, మాఢవీధులు, క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, సత్యనారాయణ వ్రత మండపాలు భక్తులతో కిటికిటలాడాయి. కొండకింద పార్కింగ్ వాహనాలతో నిండిపోయింది. స్వామి ధర్మ దర్శనానికి 4గంటలు, ప్రత్యేక దర్శనానికి 3గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.
ఘనంగా స్వామి,అమ్మవార్ల నిత్యారాధనలు
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం చేశారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు పలు దఫాలుగా సువర్ణ పుష్పార్చన పూజలు చేశారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు ఉత్సవమూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ నిర్వహించారు. సుమారు గంటన్నరకు పైగా నిత్య కల్యాణతంతు జరిపించారు. కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి సేవ, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన చేశారు. పాతగుట్టలో స్వామివారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు.
ధునుర్మాసోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున అర్చకులు వేదమంత్రాలు పటిస్తూ అమ్మవార్లకు తిరుప్పావై పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ధనుర్మాస విశిష్టతను భక్తులకు వివరించారు. గోదాదేవి రంగనాయకుడిపై రచించిన పాశురాలను పఠిస్తూ అర్చకులు మార్గళి పూజలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 44వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి వారి ఖజానాకు రూ.64,50,178 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. యాదాద్రీశుడిని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.